బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతి ఎంపీ రిషి సునక్ తన తొలి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు.ఈ క్రమంలో ఆయన వలసదారులకు షాకిచ్చే నిర్ణయం ప్రకటించారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బ్రిటన్ లాంగ్ టర్మ వీసా ఖర్చు పెరగనుంది.ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్ చార్జ్ (ఐహెచ్ఎస్)ను 400 పౌండ్ల నుంచి 624 పౌండ్లకు పెంచనున్నట్లు రిషి సునక్ ప్రకటించారు.
బ్రిటన్ ఎన్హెచ్ఎస్ నుంచి వలసదారులు ప్రయోజనం పొందుతున్నారు.ఎన్హెచ్ఎస్పై ఇప్పటికే అదనపు సర్ ఛార్జీ ఉన్నప్పటికీ, ఇది ప్రజలు పొందే ప్రయోజనాలను సరిగ్గా ప్రతిబింబించదు.అందువల్ల తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్ఛార్జ్ని 624 పౌండ్లకు పెంచుతున్నామని ఇందులో పిల్లలకు రాయితీ ఉంటుందని రిషి సునక్ బుధవారం బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్లో తెలిపారు.
18 సంవత్సరాల లోపు పిల్లలకు 470 పౌండ్ల కొత్త రాయితీని బడ్జెట్లో చేర్చారు, కానీ అంతర్జాతీయ విద్యార్ధులకు మాత్రం ఇది 300 పౌండ్ల నుంచి 470 పౌండ్లకు పెరిగింది.ఐహెచ్ఎస్ను యూకే ప్రభుత్వం ఏప్రిల్ 2015లో ప్రవేశపెట్టింది.2018 డిసెంబర్ వరకు దీనిని ఏడాదికి 200 పౌండ్ల నుంచి 400 పౌండ్ల వరకు పెంచుతూ వచ్చారు.ఐహెచ్ఎస్కు అదనపు నిధులను పెంచేందుకు గాను ఆరు నెలలకు పైబడి వర్క్, స్టడీ, ఫ్యామిలీ వీసాలపై రుసుమును విధిస్తున్నారు.
మరోవైపు భారతీయ సంతతికి చెందిన వైద్య నిపుణుల కోసం యూకేలోనే అతిపెద్ద ప్రతినిది సంస్థ అయిన బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ లాబీయింగ్ చేస్తోంది.ఎన్హెచ్ఎస్లో సిబ్బంది కొరతను తీర్చడానికి భారతీయ నిపణులు అవసరమని ఈ సంస్థ వాదిస్తోంది.ప్రభుత్వ నిర్ణయం భారతీయులు బ్రిటన్కు రావడంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని ఈ సంస్థ ఆరోపిస్తోంది.
హెల్త్ సర్చార్జిని 620 పౌండ్లకు పెంచడం వల్ల విదేశీ నైపుణ్యం కలిగిన కార్మికులకు వీసా భారం మరింత పెరుగుతోందని, ఇది భారతీయ వ్యాపారాలపై ప్రభావం చూపుతోందని యూకే కౌన్సిల్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బారోనెస్ ఉషా ప్రషర్ అన్నారు.