ఏపీ అధికార పార్టీ వైసిపి లో మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి అధినేత జగన్ కు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నట్టు కనిపిస్తోంది.ప్రతిపక్షంలో ఉండగా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలోనూ, ప్రజా సమస్యలపై ఆందోళన చేసే విషయంలోనూ, యాక్టివ్ గా ఉంటూ, ఉత్సాహంగా పాల్గొంటూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు.
కానీ ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా, కొంతమంది మంత్రి పదవులు కట్టబెట్టినా ఉసూరుమంటూ, అసలు ఏమాత్రం పట్టు లేని విధంగా వ్యవహరిస్తుండడంతో జగన్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.కనీసం ప్రభుత్వాన్ని ఉద్దేశించి విపక్షాలు ఘాటుగా విమర్శలు చేస్తున్నా, ఒకరిద్దరు మించి మిగతావారి ఎవరు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో జగన్ కు ఆగ్రహం కలిగిస్తోంది.
జిల్లాల్లో ఏర్పడుతున్న లోపాలను పసిగట్టడం లోనూ, జిల్లాలోని నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ముందుకు నడిపించే విషయంలోనూ, పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఇన్చార్జి మంత్రులను జగన్ నియమించారు.వీరంతా పార్టీకి, ప్రభుత్వానికి ఊపు తెచ్చే విధంగా జిల్లా నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ముందుకు నడిపిస్తారని జగన్ భావించగా, వారిలో ఒకరిద్దరు తప్ప మిగతా మంత్రులు ఉన్నామా, లేమా అన్న్నట్టుగా వ్యవహరిస్తుండడంతో జగన్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతోంది.
పార్టీలో సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలుగా చాలా మంది ఉన్నా, వారిని కాదని సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసి జూనియర్లకు మంత్రి పదవులు కట్టబెడితే, వారి పనితీరు అంతంత మాత్రంగానే ఉండడంతో జగన్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో ఉన్న ఊపు ఇప్పుడు పార్టీ నాయకుల్లో కనిపించడం లేదట.13 జిల్లాలకు సీఎం జగన్ కీలకమైన నాయకులను ఇంచార్జీలుగా నియమించారు.అయితే వీరు జిల్లాలపై పట్టు సాధించేందుకే కాలం గడిపేస్తున్నారు తప్ప, అక్కడ తలెత్తుతున్న విభేదాలు, పార్టీ కార్యక్రమాలు, ఇలా ఏ విషయాలను పట్టించుకోవడం లేదట.
కొడాలి నాని, కన్నబాబు, అనిల్ కుమార్ ఇలా, ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వారి పనితీరు అంతంత మాత్రంగానే ఉందట.దీనికి కారణం ఆయా జిల్లాల్లో ఇన్చార్జి మంత్రుల కంటే సీనియర్లయిన ఎమ్మెల్యేలు చాలామంది ఉండటంతో తమ మాట కంటే, వారిమాటే ఎక్కువ చెల్లుబాటు అవుతుండడంతో వీరి పనితీరు అంతంత మాత్రంగానే ఉన్నట్లు జగన్ కు రిపోర్టులు అందుతున్నట్లు తెలుస్తోంది.