ఈ నెల ప్రారంభంలో యూకే జైలులో తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో పడివున్న భారత సంతతి ఖైదీ మరణించినట్లు స్కాట్లాండ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
ఫిబ్రవరి 18న ఆగ్నేయ లండన్లోని హై సెక్యూరిటీ జైలు కాంప్లెక్స్ అయిన బెల్మార్ష్ హర్ మెజెస్టి జైలు (హెచ్ఎంపీ)లో సందీప్ ఘుమాన్ అనే భారతీయ ఖైదీ తీవ్ర గాయాలతో పడివున్నాడు.
సమాచారం అందుకున్న అధికారులు, లండన్ అంబులెన్స్ సర్వీస్ జైలు వద్దకు చేరుకుని ఘుమన్ను ఆసుపత్రికి తరలించారు.ఆ మరుసటి రోజే హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను మరణించాడు.
గత శుక్రవారం లండన్లోని గ్రీన్విచ్ మార్చురీలో సందీప్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు.తలకు గాయం కావడం వల్లే అతను మరణించినట్లు పోస్ట్మార్టం నివేదిక చెబుతోంది.అదే జైలులో ఘుమన్తో కలిసి శిక్ష అనుభవిస్తున్న మరో ఇద్దరు ఖైదీలు అతనిపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్న అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు మెట్ పోలీసులు పేర్కొన్నారు.జైలు అధికారులు, స్థానిక పోలీసుల సాయంతో ఈ ఘటనకు దారి తీసిన కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు మెట్స్ స్పెషలిస్ట్ క్రైమ్ కమాండ్ తెలిపింది.
బెల్మార్ష్ జైలులో యూకేలోనే అత్యంత ప్రమాదకరమైన ఖైదీలను ఉంచుతారు.ఇటీవలి తనిఖీ నివేదికల్లో భాగంగా ఈ జైలులో ఖైదీల మధ్య హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులో సందీప్ ఇదే జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.