ప్రస్తుత కాలంలో కొందరు యువకులు టిక్ టాక్ చేయాలనే నెపంతో ప్రాణాల మీదకు తెచ్చుకుని అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.తాజాగా ఓ యువకుడు చెరువులో టిక్ టాక్ చేస్తూ ప్రమాద వశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో పవన్ అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఇతడు టిక్ టాక్ యాప్ ని ఉపయోగిస్తూ అందులో వీడియోలను కూడా షేర్ చేస్తుంటాడు.
అయితే తాజాగా పవన్ తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు మీర్ పేట్ చెరువు దగ్గరకు వెళ్లాడు.అయితే ఈ క్రమంలో అప్పట్లో శ్రీహరి నటించిన భద్రాచలం చిత్రంలో పడవ మునిగి పోతున్నప్పుడు శ్రీహరి నదిలో దూకి కాపాడిన సన్నివేశాన్ని టిక్ టాక్ చేయాలని భావించి చెరువులో దూకాడు.
అయితే ప్రమాదవశాత్తు గోతిలో పడి ఈత రాకపోవడంతో ప్రాణాలు వదిలాడు.
ఇదంతా గమనిస్తున్న అతని స్నేహితులు భయపడి అక్కడి నుంచి పారిపోయారు.అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పవన్ ని బయటకు తీసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.దీంతో ఒక్కగానొక్క కొడుకుని ఎంతో గారాబంగా పెంచుకున్న ఆ తల్లిదండ్రులు ఆర్తనాదాలు మిన్నంటాయి.
అలాగే మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.