తెలంగాణలో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి.ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
అధికార పార్టీ టిఆర్ఎస్ దూకుడుకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించకపోవడం, కాంగ్రెస్ పరిస్థితి మరింతగా దిగజారిపోవడం, తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న సరైన మార్గంలో పార్టీని నడిపిస్తూ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే సమర్ధుడైన నాయకుడు లేకపోవడం బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి.ప్రస్తుతం టీఆర్ఎస్ హవా నడుస్తున్నావచ్చే ఎన్నికల నాటికి అది బాగా తగ్గిపోతుందని, అప్పటికి కాంగ్రెస్ పూర్తిగా తెలంగాణలో కనుమరుగవుతుందని బిజెపి అంచనా వేస్తుంది.
అందుకే అప్పటి నుంచి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి ముందుకు నడిపించగల యువ నాయకుడు కోసం బిజెపి ఎదురు చూపులు చూస్తోంది.
ఈ క్రమంలో ఆ పార్టీ కన్ను తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీద పడింది.
ఎప్పటి నుంచో రేవంత్ ను బీజేపీ లోకి తీసుకు వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నా ఆయన మాత్రం బీజేపీలో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దేశ వ్యాప్తంగా ఆందోళనకరంగా ఉండటం, తెలంగాణలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, సొంత పార్టీ నాయకులే తన ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయడం ఈ అన్ని పరిణామాలతో రేవంత్ రెడ్డి బాగా విసుగు చెందారు.
అందుకే ఆయన కూడా చాలా కాలంగా పార్టీ మారాలనే ఆలోచనతో ఉన్నారు.మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా రేవంత్ గెలవడంతో బిజెపి మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఈ మేరకు ఆయనతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.
రేవంత్ బిజెపిలో కనుక చేరితే రాష్ట్ర పగ్గాలతో పాటు కేంద్ర మంత్రివర్గంలో కూడా స్థానం కల్పిస్తామని బీజేపీ అధిష్టానం ఆయనకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.దీనిపై రేవంత్ కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం.కనుక బీజేపీ లో చేరితే ఆయనకు రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి కూడా ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధంగా ఉందట.
ఆయనతో పాటు తెలంగాణ లో బలమైన నాయకులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరావు వంటి నాయకులను కూడా బీజేపీలో చేర్చుకుని సముచిత స్థానం కల్పించాలని బీజేపీ చూస్తోందట.ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీరితో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.