ఎలాంటి ప్రయోగశాలలు, సాంకేతిక సాయం లేకుండా కేవలం తన ఇంట్లో తయారు చేసిన రాకెట్ను ప్రయోగించే ప్రయత్నంలో ఒక ఔత్సాహిక వ్యోమగామి దుర్మరణం పాలయ్యాడు.మైఖేల్ ‘‘మ్యాడ్ మైక్’’ హ్యూస్ తన ఇంట్లో తయారు చేసిన రాకెట్ను ప్రయోగించే ప్రయత్నంలో మరణించారని డిస్కవరీ ఛానెల్కు చెందిన ఓ సైన్స్ ఛానెల్ తెలిపింది.
64 ఏళ్ల హ్యూస్ వృత్తిరీత్యా స్టంట్మేన్.ఈ క్రమంలో శనివారం కాలిఫోర్నియా రాష్ట్రం బార్స్టోవ్లోని తన ఇంటి పెరట్లో ఆవిరితో నడిచే రాకెట్ను ప్రయోగించాడు.
అతని ప్రయోగానికి అమెరికాలోని పలు కంపెనీలు స్పాన్సర్ చేశాయి.భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగానే ఉందని నిరూపించేందుకు గాను 1,500 మీటర్ల నుంచి 5,000 మీటర్ల ఎత్తులో రాకెట్ను ప్రయోగించాలని ఆయన నిర్ణయించాడు.
ప్రయోగానికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.ప్రయోగాన్ని వీక్షించేందుకు వచ్చిన వారు ఆ సమయంలో భయపడినట్లుగా ఆ ఫోటోలు ఉన్నాయి.రాకెట్ ప్రయోగం తర్వాత ఓ పారాచూట్ దాని నుంచి విడిపోయి లాస్ ఏంజిల్స్కు ఈశాన్యంగా 110 కిలోమీటర్ల దూరంలోని హైవే నెంబర్ 247లో కూలిపోయిందని శాన్ బెర్నార్డినో కౌంటీ షరీఫ్ కార్యాలయం తెలిపింది.హ్యూస్ మరణాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఎడారి ప్రాంతంలో రాకెట్ కూలిపోయి ఓ వ్యక్తి చనిపోయినట్లు మాత్రం చెప్పారు.
ఈ ఘటనపై షెరీఫ్ ఏవియేషన్ విభాగం దర్యాప్తు చేస్తోంది.
హోమ్మేడ్ అస్ట్రోనాట్స్ అనే కొత్త సిరీస్ కోసం తాను ఈ ప్రయోగం చేస్తున్నట్లు హ్యూస్ ఓ సైన్స్ ఛానెల్కు చెప్పినట్లుగా తెలుస్తోంది.ఎరుపు, నలుపు రంగు కల స్పేస్ సూట్ ధరించిన హ్యూస్ రాకెట్ ముందు నిలబడి తన ప్రణాళికలను డిస్కవరీ ఛానెల్కు వివరించాడు.