భారతీయుల్లో ఒక విశిష్ట గుణముంది.ఎవరైనా ప్రేమించినా, అభిమానించినా అది మోతాదుకు మించిపోతుంది.
నాయకులు, సినీతారలు, క్రికెటర్లను దేవుళ్లుగా విగ్రహాలు పెట్టి మరీ పూజిస్తారు.ఇప్పుడు ఈ లిస్ట్లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేరారు.
తెలంగాణ రాష్ట్రం జనగామకు చెందిన బుస్స కృష్ణకు అగ్రరాజ్యాధినేత ట్రంప్కు వీరాభిమాని.ఎంత పిచ్చంటే చచ్చేంత ప్రేమ.ఇంటి ముందు ఒక షెడ్ను నిర్మించి, అందులో ఆరడుగుల ట్రంప్ విగ్రహం ప్రతిష్టించాడు.ప్రతి రోజు ఆ విగ్రహానికి ధూప దీప నైవేద్యాలు పెట్టి పూజలు చేస్తాడు.
అమెరికా అధ్యక్షుడు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉపవాస దీక్ష కూడా చేస్తున్నాడు కృష్ణ.అతని అభిమానాన్ని చూసిన గ్రామస్తులంతా కృష్ణను ట్రంప్ కృష్ణ అని సరదాగా పిలుస్తారు.
ఈ క్రమంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ట్రంప్ ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారతదేశానికి రానున్నారు.ఈ విషయం తెలుసుకున్న కృష్ణ.తన దేవుడిని కలిసే అవకాశం కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.అమెరికా అధ్యక్షుడు తనకు దేవుడని.పని మీద ఎక్కడికి వెళ్లినా ఆయన ఫోటో తనతో పాటే ఉంటుందని చెప్పాడు.ఏ పని అయినా ఆయన ఫోటోకు మొక్కిన తర్వాతగాని మొదలుపెట్టనని చెప్పాడు.
ఆయన భారతదేశానికి వస్తుండటంతో ట్రంప్ను కలవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నాడు.భారత ప్రభుత్వం తప్పకుండా తన కోరిక నెరవేరుస్తుందని కృష్ణ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
కాగా ఢిల్లీతో పాటు అహ్మదాబాద్లో పర్యటించనున్న డొనాల్డ్ ట్రంప్… ప్రధాని మోడీతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోటేరాను ప్రారంభించనున్నారు.ఆయన పర్యటనలో ఎలాంటి లోటు రాకుండా ఉండేందుకు గాను గుజరాత్ ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్లు వరకు ఖర్చు చేస్తోంది.ట్రంప్ పర్యటించే మార్గాల్లో పాన్ మరకలు కనిపించకుండా శుభ్రం చేస్తున్నారు.
అంతేకాకుండా ట్రంప్ పర్యటన ముగిసే వరకు ఆ మార్గాల్లో ఎక్కడా పాన్ షాపులు తెరవొద్దని పాన్ వాలాలకు అధికారులు హుకుం జారీ చేశారు.