టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి పార్టీ నాయకులపై తీవ్ర ఆవేశంతో రెచ్చిపోయారు.కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, మేయర్లతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆవేశంగా మాట్లాడిన కేసీఆర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ల పై తీవ్రస్థాయిలో ప్రసంగించారు.ఈ సందర్భంగా మున్సిపల్, కార్పొరేషన్ ఛైర్మన్స్, ఎమ్మెల్యేలు మంత్రులకు గట్టిగా క్లాస్ పీకారు.
మున్సిపాలిటీ అంటే అవినీతి, మురికికి మారుపేరుగా మారిపోయాయని, ఎవరూ వాటిని సరైన విధంగా పట్టించుకోవడంలేదని, చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేద్దామన్న ఆలోచన ఎవరికీ లేకుండా పోయిందని కెసీఆర్ అన్నారు.
ప్రజా ప్రతినిధులు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మానేసి పనులపై దృష్టి పెట్టాలని కేసీఆర్ ఆగ్రహంగా చెప్పడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.మీరంతా ప్రజల కు అవసరమైన విధంగా పనులు చేస్తే ఆరు నెలల్లోనే మున్సిపాలిటీలు అద్భుతంగా తయారవుతాయని వాటిపై అంతా శ్రద్ద పెట్టాలన్నారు.ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ కేసీఆర్ సూచించారు.
మూడు నెలల్లో అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావాల్సిందేనని, దీనిని నిర్లక్ష్యం చేయొద్దని కేసీఆర్ సూచించారు.మున్సిపాలిటీ, కార్పొరేషన్సం లకు సంబంధించి నిధుల సమస్య ఉన్నా వాటిని అధిగమించి మరీ అభివృద్ధి కి శ్రీకారం చుట్టాలని కోరారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్, కమిషనర్ లు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని కేసీఆర్ సూచించారు.
పాలనలో దుబారా తగ్గించి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని చెప్పారు.గ్రామాల్లో పర్యటించేందుకు మండల పంచాయతీ స్థాయి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇకపై అలా చేస్తే ఊరుకోబోమని కేసీఆర్ హెచ్చరించారు.మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ సమస్యలు మురికి కాలువల పరిశుభ్రత ఇలా అన్ని విషయాలను ప్రజాప్రతినిధులంతా బాధ్యతగా తీసుకొని పనిచేసి సరైన రిజల్ట్ తీసుకురాకపోతే మీ పదవులు ఊడతాయంటూ కేసీఆర్ హెచ్చరించారు.
దీంతో ఒక్కసారిగా సమావేశంలో పాల్గొన్న వారంతా షాక్ అయ్యారు.కెసిఆర్ మరీ ఇంత ఆవేశంగా మాట్లాడటం వెనుక కారణాలు ఏంటో తెలియక ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా కాస్త కంగారు పడ్డారు.