జగన్ ఢిల్లీ వెళ్లిన దగ్గర నుంచి ఏపీలో అనూహ్యమైన మార్పులు, రాజకీయ నిర్ణయాలు చోటుచేసుకుంటున్నాయి.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.
రాజకీయంగా వైసీపీకి కూడా ఈ వ్యవహారాలు తలనొప్పులు తెచ్చిపెట్టాయి.వీటిలో ముఖ్యంగా చెప్పుకుంటే మూడు రాజధానులతో పాటు శాసనమండలిని రద్దు చేయడం తదితర అంశాలు రాజకీయ దుమారాన్ని లేపాయి.
శాసనమండలిని రద్దు చేస్తారని ముందుగా ఎవరు ఊహించలేదు.అసెంబ్లీలో శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి జగన్ కేంద్రం చేతిలో ఆ వ్యవహారాన్ని పెట్టేసాడు.
అయితే కేంద్రం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియక అంతా సతమతం అయ్యారు.
అప్పటి పరిణామాల నేపథ్యంలో వైసీపీకి వ్యతిరేకంగా కేంద్రం ఉండడంతో ఈ బిల్లును ఆమోదించారని టిడిపితో సహా అందరూ అంచనా వేశారు.కానీ ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ వైఖరిలో స్పష్టమైన మార్పు రావడంతో ఇక జగన్ కు అనుకూలంగా బిజెపి పెద్దలు తమ నిర్ణయం ప్రకటించడంతో జగన్ కు అనుకూలంగా నిర్ణయాలు వెలువడుతున్నాయి.తాజాగా శాసన మండలి రద్దు విషయంలోనూ జగన్ కు కేంద్ర పెద్దలు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈనెల 15న సీఎం జగన్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కలిసినట్లు సమాచారం.వాస్తవానికి న్యాయ శాఖ మంత్రితో జగన్ షెడ్యూల్ లేకపోయినా కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ లభించడంతో ఆయన్ను కలిశారు.
హైకోర్టు తరలింపు వ్యవహారం న్యాయ శాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి రవిశంకర్ ప్రసాద్ ను కలిసి దీనిపై వేగంగా నిర్ణయం తీసుకోవాలంటూ జగన్ కోరారు.కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని గతంలో బీజేపీ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది.అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాన్నే తాము అమలు చేస్తున్నామని తమ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది.దీంతో పాటు శాసన మండలి రద్దు పై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి తర్వాత రాష్ట్రపతి సంతకం పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
అప్పుడు శాసన మండలి రద్దు అవుతుంది.మార్చి 3 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడంతో ఆ సమావేశంలోనే కేంద్రం శాసన మండలి రద్దు బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చి రద్దు చేస్తూ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు జగన్ కు కేంద్ర బిజెపి పెద్దలు స్పష్టమైన హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం.