జనసేన బిజెపి పార్టీలు ఏపీలో అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లే క్రమంలో ఈ రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాయి.ఏపీలో పవన్ ఇమేజ్ వాడుకుని వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలని బిజెపి ముందు నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఉంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ అండ ఉంటే రాజకీయంగాను, ఆర్ధికంగాను అండదండలు లభిస్తాయని, వేగంగా బలపడేందుకు వీలవుతుందని భావించి బీజేపీతో పొత్తుకు ఓకే చెప్పేశారు పవన్.ఏపీలో వైసిపి టిడిపిలకు ప్రత్యామ్నాయంగా బిజెపి జనసేన కలిసి ముందుకు వెళ్తాయని, ప్రజా పోరాటాలు ఉద్యమాలు చేయడంలో ఒకే అభిప్రాయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుని ఈ మేరకు ఒక సమన్వయ కమిటీని కూడా నియమించుకున్నారు.
కానీ పొత్తు పెట్టుకున్న తర్వాత బిజెపి వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది.
జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఎక్కడా ఆ పార్టీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా బిజెపి ఉండడం, అదే సమయంలో బీజేపీ అగ్ర నేతలను కలిసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించినా వారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం తదితర పరిణామాలు మింగుడు పడని అంశంగా మారాయి.ఇదే సమయంలో జగన్ తో బిజెపి అగ్రనేతలు చర్చలు జరపడం, దాదాపుగా ఎన్డీఏ లోకి వైసిపి చేరడం ఖాయమని, దానికి ఫలితంగా రెండు, మూడు మంత్రి పదవులు వైసిపికి లభించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుండడంతో ఇక బీజేపీ లో ఉన్నా తనను రాజకీయంగా వెనుకబడి పోతాననే భావన పవన్ లో వచ్చేసింది.
ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని ఏపీలో టీడీపీ తో కలిసి అడుగులు వేస్తే ఫలితం ఉంటుందని పవన్ డిసైడ్ ఐపోయినట్టుగా తెలుస్తోంది.గతంలో టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చిన కారణంగానే ఆ పార్టీ ఎన్నికల్లో గెలిచిందని, ఇప్పుడు కూడా తమ కాంబినేషన్లో ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామని, అప్పటి ప్రాధాన్యతను బట్టి కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ముఖ్యమంత్రి పదవి విషయంలో ఏదో ఒక నిర్ణయంతీసుకోవచ్చని, ప్రస్తుతానికి టీడీపీతో కలిసి ముందుకు వెళితేనే బెటర్ అన్న ఆలోచనకు పవన్ వచ్చినట్లు జనసేనలో అత్యంత్య విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది ?
.