జనసేన పార్టీ తరుపున ఏపీ మొత్తానికి గెలిచినా ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.ఇతను గెలిచినా తర్వాత కొద్ది రోజులు పవన్ కళ్యాణ్ కి విధేయుడుగా ఉన్నాడు.
దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ రాపాకని హీరోలా చూస్తూ ఆయనకీ పవన్ కళ్యాణ్ స్థాయిలో గౌరవం ఇచ్చేవారు.అయితే ఊహించని విధంగా టర్న్ తీసుకొని పార్టీలో ఉంటూనే వైసీపీ విధానాలకి జై కొట్టడం మొదలెట్టారు.
మొదట్లో ఇదేదో క్యాజువల్ గా చేసారని అనుకున్న తరువాత ఆ పద్ధతి పూర్తిగా ముదిరిపోయి జగన్ తానా అంటే రాపాక తందాన అనే వరకు వచ్చేసింది.దీంతో జనసేన కార్యకర్తలు రాపాకని పూర్తిగా పక్కన పెట్టేసి అతను తమ ఎమ్మెల్యే అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేసారు.
అయితే రాపాక జనసేన స్టాండ్ దాటిపోయి పూర్తిగా వైసీపీ పాట పాడుతున్న పవన్ కళ్యాణ్ అతని మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు.దీనికి కారణాలు అయితే తెలియదు కాని తాజాగా తాడేపల్లిగూడెం పార్టీ కార్యకర్తల సమావేశంలో రాపాక గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి పెంచాయి.
ప్రజల కోసమే తాను రాజకీయాలలోకి వచ్చానని అధికారం తనకి ముఖ్యం కాదని చెప్పిన పవన్ కళ్యాణ్ రాపాక గురించి మాట్లాడుతూ జనసేన పార్టీ నుంచి గెలిచినా ఒకే ఒక్క ఎమ్మెల్యే పార్టీలో ఉన్నారో లేరో అనే విషయం తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఒక పార్టీ అధినేతగా ఉండి పార్టీ తరుపున గెలిచినా ఎమ్మెల్యే ఉన్నారో, లేరో అంటున్నారంటే రాపాక విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టాండ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పుకుంటున్నారు.
మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాపాక ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.