ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రశాంత్ కిషోర్ మాత్రమే.అమోఘమైన తెలివితేటలతో పాటు రాజకీయ వ్యూహాలు పన్నడంలో ఆయనకు ఆయనే సాటి.
ఆయన చాలా కాలాంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.ఆయన ఏ పార్టీ తరపున ఒప్పందం చేసుకుంటే ఆ పార్టీ విజయం సాధిస్తూ వస్తుండడంతో ఆయనకు మరింతగా పేరు ప్రఖ్యాతలు పెరిగాయి.
ఏపీలో వైసీపీ, తాజాగా ఢిల్లీ లో ఆమ్ ఆద్మీ పార్టీల విజయంలో పీకే పాత్ర ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ విజయాలతో పీకే డిమాండ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది.
ఆయన సేవలను ఉపయోగించుకునేందుకు తమిళనాడులో చాలా పార్టీలు పోటీ పడుతున్నాయి.
ఈ సంగతి ఇలా ఉంటే పీకే మాత్రం ఒక పక్క రాజకీయ సలహాలు ఇస్తూనే మరోపక్క సొంతంగా పార్టీ పెట్టి తన సత్తా చాటుకోవాలనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఉద్దేశంతోనే తన సొంత రాష్ట్రమైన బీహార్ లో రాజకీయ చక్రం తిప్పాలని ఉద్దేశంతో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ లో ఆయన చేరారు.కానీ నితీష్ కుమార్ కు, ప్రశాంత్ కిషోర్ కు అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఆయన జేడీయూ నుంచి బయటకి వచ్చేసారు.
అయితే నితీష్ ప్రత్యర్థి అయిన ఆర్జేడీకి మద్దతు ఇవ్వొచ్చనే ప్రచారం వస్తున్న నేపథ్యంలో పీకే ఆలోచన అంతా సొంతగా పార్టీ పెట్టాలనే ఉందట.
మొన్నటి వరకు ఢిల్లీ ఎన్నికల వ్యూహాలతో బిజీగా ఉండడంతో ఈ విషయంపై పెద్దగా దృష్టిపెట్టని ఆయన ఇప్పుడు సొంత పార్టీ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.ఈ మేరకు ఈ నెల 18 వ తేదీన ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.దీనిపై ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు దీనిపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ ఏడాది ఆఖర్లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పార్టీ పెట్టడమే కాకుండా ఆ ఎన్నికల్లో గెలిచి బీహార్ లో చక్రం తిప్పాలని పీకే ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం
.