ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్ధిరపడిన ప్రవాస భారతీయులతో సంబంధాన్ని బలోపేతం చేసేందుకు గాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.ఇందుకుగాను రాష్ట్ర ఎన్ఆర్ఐ విభాగం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
రాష్ట్రంలోని వివిధ రంగాలలో వున్న అభివృద్ధి అవకాశాలలో ఎన్ఆర్ఐలను భాగస్వామ్యం చేయడం కూడా ఈ వ్యూహంలో భాగమే.
ప్రవాస భారతీయుల సమస్యలు తీర్చడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్నారై విభాగం, ప్రస్తుతం వారితో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నారైల డేటాను సిద్ధం చేసే పనిలో ఉంది.
ఆర్ధిక, ఉపాధి కల్పన, ఆరోగ్యం, విద్య మొదలైన రంగాల్లో అభివృద్ధికి ఎన్ఆర్ఐ సమాజంతో సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు ఈ విభాగం కృషి చేస్తోందని యూపీ ప్రభుత్వ ప్రతినిధి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు.
ఎన్నారైలకు సంబంధించిన సమాచారాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా సంపాదిస్తామని ఆయన వెల్లడించారు.వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ)తో పాటు సూక్ష్మ, స్థూల, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఎన్ఆర్ఐ కనెక్ట్ సహాయపడుతుంది.ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రవాస భారతీయుల డేటా ఇతర వివరాలను పొందేందుకు గాను ఆ రాష్ట్ర ఎన్ఆర్ఐ విభాగం ఇప్పటికే వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించే ప్రక్రియ ప్రారంభించింది.అలాగే తన అధికారిక వెబ్సైట్ www.upnri.comలో ఎన్నారై డైరెక్టరీ లింక్ను కూడా ఉంచింది.ఇప్పటి వరకు వెబ్సైట్లో నమోదు చేసుకున్న సభ్యుల జాబితాను రిజిస్టర్డ్ సభ్యులు మాత్రమే చూడగలరు.