కాలం మారింది, కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు.ఈ కాలంలో కులాలు మతాలు అనేవి లేకుండా పోయాయి.
కాని ఇంకా కొన్ని ప్రాంతాల్లో మరియు వర్గాల్లో మాత్రం కులాలు మతాలు అంటూ కొట్టుకు చస్తున్నారు.కంప్యూటర్ యుగంలో కూడా ప్రేమ పెళ్లిలకు అనుమతి దక్కడం లేదు.
ఎంత చెప్పినా కొందరిలో మాత్రం మార్పు రాకపోవడం అందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ప్రేమలకు సంబంధించిన గొడవలు, పరువు హత్యలు, గ్రామ బహిష్కరణలు ఎక్కువగా ఉత్తర ప్రదేశ్లో మనం చూస్తూ ఉంటాం.
అక్కడ ఉన్న పరిస్థితులు మరే రాష్ట్రంలో ఉండవంటే అతిశయోక్తి కాదు.అక్కడ ప్రజలు ముఖ్యంగా కొన్ని గ్రామాల వారు మరీ అనాగరికంగా వ్యవహరిస్తున్నారు.హత్యలు మరియు గ్రామ బహిస్కరణలతో ప్రేమను చంపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.పోలీసులు, ప్రభుత్వాలు ఉన్నా కూడా గ్రామ పెద్దలు గ్రామస్తులే న్యాయ స్థానం అన్నట్లుగా అక్కడ పరిస్థితి ఉంది.
తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జాన్సీ జిల్లాకు చెందిన భూపేశ్ యాదవ్ అనే వ్యక్తి ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు.కులం కాని అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చావు అంటూ భూపేష్ను గ్రామ బహిష్కరణ చేశారు.గత కొన్ని రోజులుగా గ్రామంకు బయట ఉంటున్న భూపేష్ మళ్లీ గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి అమ్మాయిని గ్రామంలోకి ఆహ్వానించాలి అంటే ఆమె గో మూత్రం తాగాలి మరియు గోవు పేడను తినాలంటూ కండీషన్ పెట్టారట.
తమ ప్రేమ పెళ్లికి గో మూత్రంకు సంబంధం ఏంటీ అంటూ భూపేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పెద్ద మనుషుల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.తన కుటుంబ సభ్యులపై వారు చేస్తున్న దాడులను పోలీసు దృష్టికి తీసుకు వెళ్లాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు పెద్ద మనుషులకు కౌన్సిలింగ్ ఇస్టున్నట్లుగా సమాచారం అందుతోంది.