అగ్ర రాజ్యం అమెరికాని ముంచెత్తుతున్నాయి ప్రకృతి వైపరీత్యాలు.ఒక ఉపద్రవం తరువాత మరొకటిగా వచ్చి పడుతున్నాయి.
దాంతో అమెరికా వాసులకి కంటి మీద కునుకు ఉండటం లేదు.నెల రోజుల క్రితం మంచు తుఫాను అమెరికాని అతలాకుతలం చేస్తే, ఆ తరువాత వచ్చిన భారీ వర్షాలు అమెరికా ప్రజలని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమెరికా వాసులపై మళ్ళీ ప్రకృతి పంజా విసిరింది.
అమెరికాలోని ఉత్తర కరోలినాలో ఒక్క సారిగా భారీ గాలులు, ఉరుములతో కూడిన వర్షం రావడంతో అమెరికన్స్ కంగారు పడిపోయారు.
ఏమి జరుగుతుందో తెలుసుకునే లోగానే సుమారు 3 లక్షల ఇళ్ళకి కరెంటు నిలిచిపోయింది.రోడ్డు ప్రమాదాలు, వరదలు వర్షం కారణంగా సుమారు ఐదుగురు మృతి చెందారు.దాంతో పశ్చిమ వర్జీనియాలో ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం…అంతేకాదు
చాలా ప్రాంతాలలో విధ్యాసంస్థలకి సెలవులు ప్రకటించారు.ఇదే పరిస్థితి కోరోలినా తో పాటు పెన్సిల్వేనియా లో కూడా చోటు చేసుకుంది.ఉత్తర , దక్షిణ, కరోలినా, వర్జీనియా ప్రాంతాలలో పలు చోట్ల విద్యుత్ సరఫరాకి తీవ్ర అంతరాయం కలిగింది.చాలా చోట్ల చెట్లు పడిపోవడంతో ఇల్లు ధ్వంసం అయ్యాయి.
ఈ తుఫాను తాకిడి ఎక్కువగా ఉందని, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని టెన్నెసీ లోయ లోని ప్రధాన కార్యాలయం సూచనలు చేసింది.ఇప్పటికే కొన్ని స్వచ్చంద సంస్థలు బాధితులకి సాయం కోసం సిద్దమవుతున్నాయని స్థానిక మీడియా ప్రకటించింది.