ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయం ఎదగాలని ప్రయత్నం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత చాలా యాక్టివ్ గా ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు వింటూ వారికి అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.ఇసుక సమస్య, రైతుల పంట గిట్టుబాటు ధర, ఇప్పుడు అమరావతి రాజధాని అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల గొంతుకై వినిపిస్తున్నారు.
ఉద్యమాన్ని తీవ్రంగా నడిపిస్తూ వైసీపీ పార్టీకి కొంత తలనొప్పిగా మారాడు.దీంతో పవన్ కళ్యాణ్ మీద వైసీపీ శ్రేణులు ఎన్ని రకాలుగా దాడి చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే రాజధాని అనేది ఎక్కడో ఒకచోటనే ఉండాలని చెబుతూ వస్తున్నా జనసేన ఇప్పుడు విశాఖ పరిపాలనా రాజధాని విషయంలో తన ఆలోచనని మార్చుకున్నారా అంటే అవుననే మాట వినిపిస్తుంది.
విశాఖలో పరిపాలన రాజధాని కోసం వైసీపీ ప్రభుత్వం భూసమీకరణ చేస్తుంది.
అయితే విశాఖలో ప్రభుత్వ భూమి ఉన్న కూడా ఇంకా అసైన్డ్ భూముల కోసం రైతుల నుంచి భూ సేకరణ చేస్తున్నారు.అసైన్డ్ భూములని గతంలో ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల రైతులకి ఇచ్చారు.
వాటినే మరల వెనక్కి తీసుకోవడంపై ఆ రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయాన్ని ఉత్తరాంద్ర జనసేన నేతలు పవన్ కళ్యాణ్ వద్దా తాజాగా ప్రస్తావించారు.
దీనిపై పవన్ స్పందిస్తూ ఉత్తరాంద్రలో పరిపాలనా రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం ఎలా భూసమికరణ చేసిన అక్కడ రైతులకి ఇబ్బంది లేకుండా చేయాలని, కాని వైసీపీ ప్రభుత్వం మాత్రం పేదల కడుపు కొట్టే విధంగా బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.జనసేనాని తన మాటల ద్వారా ఓ వైపు విశాఖ రాజధానిని సమర్ధిస్తున్న అమరావతి తరహాలో బలవంతపు భూసేకరణ చేస్తే మాత్రం అడ్డుకుంటామని చెబుతున్నారు.
దీనిని బట్టి పవన్ అమరావతి రాజధాని అనే అంశాన్ని ఇంకా పట్టుకున్న ప్రయోజనం లేదనే విషయం అర్ధం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.