గతేడాది తూత్తుకుడి రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు కాల్పులు కూడా జరిపారు.
ఈ క్రమంలో 13 మంది ప్రాణాలు కోల్పోవడం తో ఈ ఘటన పెద్ద దుమారం రేపింది.రాగి కర్మాగారం అక్కడ ఏర్పాటు చేయకూడదు అంటూ పలువురు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు జరపడం, పోలీసులు ఫైరింగ్ చేయడం తో 13 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు కూడా.
అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలి అంటూ ఒక ఏకసభ్య కమీషన్ ను ఏర్పాటు చేశారు.ఈ కమీషన్ ఇప్పుడు ఈ ఘటన విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తుంది.
ఈ తూత్తుకుడి ఘటన కోసం మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమీషన్ ఏర్పాటు చేసి విచారణ జరపాలి అని కోరింది.ఈ క్రమంలో రజనీకాంత్ ఫిబ్రవరి 25 న కమీషన్ ఎదుట హాజరుకావాలి అంటూ సమన్లు లో పేర్కొంది.
అయితే గత ఏడాది తూత్తుకుడి రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా ఆందోళనల సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రజనీకాంత్ మాట్లాడుతూ.కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడం వల్లే పోలీసులు కాల్పులు జరిపారంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేగాయి.
అయితే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమైనప్పటికీ కూడా దానిపై వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు రజనీ.అంతేకాకుండా తనకు అన్నీ తెలుసంటూ వ్యాఖ్యానించారు కూడా.అయితే ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కమీషన్ కోరనున్నట్లు సమాచారం.