ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గతేడాది గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందును ఎలుకలు కొరికి చంపిన విషయం గుర్తు ఉండే ఉంటుంది.
ఇలాంటి సంఘటనలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్వసాధారణం అయిపోయాయి.అయితే తాజాగా ఏలూరు లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఒక మృతదేహం కళ్ళు పీక్కుతిన్న ఘటన అతడి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదాన్నీ నింపింది.వివరాల్లోకి వెళితే….
మంగళవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా దెందలూరు సమీపంలోని జోగన్నపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది.ఏలూరు సమీపంలోని లింగపాలెంకు చెందిన టీ.వైకుంఠ వాసును ట్రాక్టర్ ఢీకొట్టడం తో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.దీనితో అతడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే విషయం తెలుసుకున్న బంధువులు మరోసటి రోజు ఉదయం ఆసుపత్రి మార్చురీ కి రాగా, మృతుడి కనుగుడ్లు, కనురెప్పలను ఎలుకలు తిన్న ఆనవాళ్లను గుర్తించారు.తాము మార్చురీలో ఉన్న సమయంలోనూ ఎలుకలు తిరిగాయని వారు వాపోతున్నారు.
ఇదేంటి వైద్యులను సిబ్బందిని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా హడావిడిగా పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించేసినట్లు తెలుస్తుంది.
ఆస్పత్రిని శుభ్రం చేసే బాధ్యత ప్రైవేట్ ఏజెన్సీదని, ఆస్పత్రి పనులను సరిగా క్లీన్ చేయకపోవడం వల్లే ఎలుకలు వస్తున్నాయని చెప్పి ఏజెన్సీకి నోటీసులు జారీ చేశామని చెప్పి అక్కడి వైద్య అధికారులు చేతులు దులుపుకున్నారు.
అయితే ఆసుపత్రి తీరుపై మృతుల బంధువులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.