తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది.అద్బుతమైన మెజార్టీలతో మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు సిద్దం అయ్యింది.
ఇలాంటి సమయంలో నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో మాత్రం టీఆర్ఎస్ కనీసం ఒక్క వార్డును కూడా గెల్చుకోలేక పోయింది.కనీసం ఒక్క వార్డు కూడా గెల్చుకోలేక పోయిన అధికార పార్టీగా చెత్త రికార్డును టీఆర్ఎస్ దక్కించుకుంది.
అయితే ఆ రికార్డు ఆ పార్టీ కావాలని మూట కట్టుకుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా రెండు మూడు స్థానాలు అయినా దక్కేవి.
కాని అక్కడ పోటీ ఎంఐఎం మరియు బీజేపీల మద్య ఉంది.ఆ రెండు పార్టీల మద్య చేరి బీజేపీకి మంచి చేయడం ఎందుకు అనుకున్న టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎంకు కలిసి వచ్చేలా బలహీనమైన అభ్యర్థులను పెట్టడంతో పాటు ప్రచారం కూడా తక్కువ చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ కారణంగానే భైంసాలో 26 వార్డులు ఉండగా ఎంఐఎంకు ఏకంగా 15 వార్డులు దక్కాయి.బీజేపీకి 9 వార్డుల్లో విజయం దక్కింది.
స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు.స్వతంత్రులు గెలిచిన అక్కడ టీఆర్ఎస్ గెలవక పోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కావాలని టీఆర్ఎస్ చేతులు ఎత్తేసి ఉండాలి లేదంటే తెర వెనుక మంతనాలు అయినా జరిగి ఉండాలంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.