ఆదివారం రాత్రి తూర్పు లండన్లో ముగ్గురు భారతీయులను పొడిచి చంపిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.వీరిని సౌత్ పార్క్ క్రెసెంట్, ఇల్పోర్డ్కు చెందిన గుర్జీత్ సింగ్, మరోవ్యక్తిగా తెలిపారు.
శనివారం రాత్రి పుట్టినరోజు వేడుకల్లో వీరి మధ్య ఘర్షణ చెలరేగి వివాదానికి దారి తీసింది.ఆదివారం సాయంత్రానికి ఈ గొడవ ముగిసింది.
రెడ్బ్రిడ్జి కౌన్సిల్ నాయకుడు జాస్ అత్వాల్ మాట్లాడుతూ.స్థానికంగా ఉన్న పార్టీ హాల్లో జరిగిన ఈ విందులో పీకలదాగా తాగిన వీరంతా వాగ్వాదానికి దిగారని చెప్పారు.
వీరంతా బిల్డర్లేనని.గతంలోని పాతకక్షల కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది.హాల్ యజమాని మాట్లాడుతూ.అక్కడ మొదట బర్త్డే పార్టీ జరిగిందని, కానీ ఆ సమయంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోలేదన్నారు.
ఆ తర్వాత రాత్రి 11 గంటలకు హాల్ను మూసివేశామన్నారు.ఈ క్రమంలో హైరోడ్లోని ఒక కారు మెకానిక్ సోమవారం ఉదయం తన గ్యారేజ్లోని తెల్లటి కారుపై రక్తపు మరకలను గుర్తించినట్లు చెప్పాడు.
ఈ ఘటనపై స్థానికులు మాట్లాడుతూ.మాదక ద్రవ్యాల కోసం సెవెన్ కింగ్స్ హెల్త్ సెంటర్ బయట డ్రగ్స్కు బానిసలుగా వున్న వారు క్యూలో ఉన్నారని తెలిపారు.ఆ సమయంలో నేను నిన్ను చంపుతాను అని ఓ వ్యక్తి అరవగా.ఇంకొకరు పరిగెత్తండి, పరిగెత్తండి అని అరిచినట్లు ఓ మహిళ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.హత్యలు జరిగిన ప్రదేశానికి సమీపంలో నివసిస్తున్న లూయిస్ ఓ డోనోగ్ అనే వ్యక్తి మాట్లాడుతూ… ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఏదో భాషలో కొందరు అరవడం తనకు వినిపించిందన్నారు.
ఈ ఏరియాలో తరచుగా ఇలాంటి ఘటనలు మామూలే కావడంతో తాను బయటకు వెళ్లలేదని లూయిస్ చెప్పారు.అయితే ఒక్కసారిగా పోలీస్ వ్యాన్ల సైరన్లు వినిపించడంతో బయటకు వెళ్లి చూశానన్నారు.మా కిటికీ కింద ఓ వ్యక్తి నేలమీద పడిపోయి మూలుగుతున్నట్లు అతను చెప్పాడు.ఈ ఘటనపై యూకేలోని భారత హైకమీషన్ ప్రతినిధి మాట్లాడుతూ.మృతుల్లో ఇద్దరు యూకేలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు వెల్లడించారు.మరణించిన వారిని భారత్లోని పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్కు చెందిన నరీందర్ సింగ్, పాటియాలాకు చెందిన హరీందర్ కుమార్, కపుర్తాలాకు చెందిన బల్జిత్ సింగ్గా తెలిపారు.