ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే స్థాయికి జనసేన పార్టీని తీసుకెళ్లగలిగాననే సంతోషం జనసేన పార్టీ అధినేత పవన్ కు ఒక పక్క ఉన్నా తమ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తన మాట లెక్క చేయడం లేదని బాధ మరోపక్క పవన్ ను వెంటాడుతోంది.ఎమ్మెల్యేగా తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి జనసేన తరపున ఎమ్యెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ పార్టీకి విధేయుడిగా మొదట్లో ఉంటూ వచ్చారు.
ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఓ కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన సమయంలో పార్టీ తరపున అండగా ఉండడమే కాకుండా స్వయంగా రాజోలు వచ్చి దీక్ష చేపడతాను అంటూ పవన్ అప్పట్లో ప్రకటించారు.దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి రాపాకను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టింది. అయితే ఆ తర్వాత నుంచి మెల్లిమెల్లిగా రాపాక వరప్రసాద్ లో మార్పు మొదలయినట్టు కనిపించింది.జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి జై కొట్టడమే కాకుండా, పాలాభిషేకాలు చేస్తూ జగన్ ను కీర్తిస్తూ జనసేన పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా ఆయన వస్తున్నాడు.
ఈ మధ్య నియమించిన పార్టీ పదవుల్లోనూ ఆయనకు స్థానం కల్పించారు.కానీ ఆయన మాత్రం ఎక్కడా పార్టీ అధినేతను లెక్కచేయకుండా, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ అధికార పార్టీకి మద్దతు పలుకుతున్నారు.
ఈ పరిస్థితుల్లో అసెంబ్లీలో మూడు రాజధానిలో ప్రతిపాదనను వ్యతిరేకించాలని పవన్ కళ్యాణ్ రేపాకకు బహిరంగ లేఖ రాయడం, దాంట్లో పార్టీ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు.
కానీ రాపాక మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపారు.అంతేకాకుండా అసెంబ్లీ లాబీల్లో జగన్ పక్కన కూర్చుని కబుర్లు చెప్పడం పవన్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.ఇప్పటికిప్పుడు ఆయన్ను సస్పెండ్ చేస్తే ఆయన మరింతగా రెచ్చిపోయి పార్టీ మీద విమర్శలు చేస్తాడనే ఉద్దేశంతో పవన్ సైలెంట్ గా ఉంటున్నారు.
కానీ అలా చూసి చూడనట్టుగా వదిలేస్తే ముందు ముందు పార్టీ క్రమశిక్షణ తప్పుతుందని, త్వరలోనే ఆయనపై ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.