అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి.భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న ఇండియాలో భిన్న సంస్కృతులు ఉన్న కూడా ఒకరి మతాన్ని ఇంకొకరు గౌరవించుకునే అలవాటు ఉంది.
అలాగే ఒకరి విశ్వాసాలని ఇంకొకరు సమర్ధించడం వాటిని అనుగుణంగానే నడుచుకోవడం చేస్తూ ఉంటారు.ఇప్పుడు అలాంటి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఓ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఓ నిరుపేద హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయికి ముస్లింలు అందరూ కలిసి మసీద్ లో హిందూ సంప్రదాయంలోనే పెళ్లి చేశారు.ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసలు కూడా అందుకుంది.
కేరళలోని చేరావలి మస్జిద్ పక్కనే ఓ నిరుపేద హిందూ కుటుంబం నివసించేది.ఆ కుటుంబ పెద్ద తండ్రి చనిపోవడంతో కూతురి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆ తల్లిపై పడింది.
ఆ కూతురు పెళ్లి చేయడానికి తల్లికి తగిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఏంచేయాలో తోచక సమీపంలో ఉన్న మస్జిద్ కమిటీ వారికి తమ బాధను చెప్పుకుంది.వారి ఆర్ధిక స్థితి గురించి తెలుసుకున్న ఆ కమిటీవారు తమ సభ్యులతో చర్చలు జరిపి ఓ ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆ అల్లా కూడా సంతోషిస్తాడనుకున్నారు.
అంజు అనే ఆ అమ్మాయి పెళ్లి బాధ్యతను తీసుకున్నారు.మసీదు ప్రాంగణంలోనే హిందూ సాంప్రదాయం ప్రకారం పురోహితులను పిలిచి అంజు, శరత్ లకు పెళ్లి జరిపించారు.మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ సంఘటనపై మసీదు కమిటీ కార్యదర్శి నజుముద్దీన్ స్పందించారు.ఈ రోజు ఇది ప్రపంచానికి ఒక ఉదాహరణ అని అన్నారు.
నూతన వధూవరులను ముస్లిం, హిందూ మత పెద్దలు ఆశీర్వదించారు.మసీదులో పెళ్లి చేసుకున్న ఈ కొత్త జంటను కేరళ సిఎం పినరయి విజయన్ కూడా అభినందించారు.