ఏపీలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు వెళుతున్నాయి.ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో తమ పట్టు చేజారిపోకుండా జాగ్రత్త పడుతోంది.
ఏపీలో జనసేన పార్టీ కారణంగా ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవనే భావనలో ఉంది వైసిపి.ఎప్పటికప్పుడు జనసేన ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
దీనిలో భాగంగానే పవన్ అన్నయ్య చిరంజీవిని తమకు దగ్గర చేసుకునే విధంగా గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది.చిరంజీవి కూడా జగన్ పై సానుకూల దృక్పథంతో ఉండడంతో ఏపీలో కొత్త సమీకరణ మొదలయ్యాయి. కొద్ది నెలల క్రితం సైరా సినిమా విడుదల సందర్భంగా చిరంజీవి తన సతీమణితో కలిసి జగన్ ను కలిశారు.ఆ సందర్భంగా సైరా సినిమాను చూడాల్సిందిగా జగన్ కుటుంబాన్ని కోరారు అనే వార్త బయటకు వచ్చింది.
ఆ మీటింగ్ నుంచి బయటకి వచ్చిన చిరు మా మధ్య రాజకీయ వ్యవహారాలేవి ప్రస్తావనకు రాలేదని చెప్పినా ఆ మీటింగ్ మొత్తం అనేక రాజకీయ విషయాలపైనే సాగినట్టు తెలుస్తోంది.చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే విషయంపైనే ఆ చర్చ అంతా జరిగిందట.
చిరంజీవి కూడా వైసీపీకి దగ్గరయ్యే ఏదోరకంగా రాజ్యసభ సభ్యత్వం పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.దానికి తగ్గట్టుగానే వైసీపీ కూడా చిరుకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని చూస్తోంది.
అందుకే తన సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా చిరు పట్టించుకోకుండా జగన్ కు జై కొడుతున్నారు.అలాగే చిరు జగన్ మధ్య ఏర్పడిన సఖ్యత కారణంగా విశాఖలో రాజధాని వస్తుందనే సమాచారాన్ని జగన్ ముందే చిరుకి లీక్ చేసారని, ఆ సమాచారం ఉండడంతోనే భారీ ఎత్తున అక్కడ భూములు చిరు కుటుంబం కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.జగన్ కూడా చిరుకి ఏదైనా పదవి ఇవ్వాలని చాలా కాలంగా భావిస్తున్నారు.ప్రస్తుతం జనసేన బిజెపి పొత్తు పెట్టుకోవడంతో రాజకీయ సమీకరణాలు కొంతమేర మారే అవకాశం ఉండడం, అది ఎప్పటికైనా తమకు ముప్పు తెస్తుందనే అభిప్రాయంతో జగన్ ఉన్నారు. అందుకే పవన్ ను దెబ్బకొట్టేందుకు చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని జగన్ చూస్తున్నారట.ఇలా చేయడం ద్వారా కాపు సామాజిక వర్గం వైసీపీ కి అండగా నిలబడుతుందని, ఏపీలో కాపులు చిరంజీవిని నమ్మినంతగా పవన్ ను నమ్మరు కాబట్టి ఇబ్బంది ఉండదని జగన్ భావిస్తున్నారు.
ప్రస్తుతం మారిన సమీకరణాలు ప్రకారం అతి తొందరలోనే చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.