ఏపీ లో చోటుచేసుకున్న పరిణామాల పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనూహ్యంగా బీజేపీ పార్టీ తో పొత్తుకు దిగడం రాజకీయ నేతలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే ఈ పొత్తు పై ఏపీ లో రాజకీయ పార్టీలు అన్ని కూడా తమదైన శైలి లో కామెంట్ చేశారు.అయితే ఈ పొత్తుపై వైసీపీ పార్టీ చేసిన ప్రచారం పై టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు.
బీజేపీ,జనసేనల పొత్తు వారి వ్యక్తిగత విషయమని,ఈ పొత్తుకు టీడీపీ కి సంబంధం ఉందంటూ వైసీపీ ప్రచారం లో ఎలాంటి నిజం లేదని పుల్లారావు వ్యాఖ్యానించారు.చిలకలూరిపేటలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నిరసన దీక్షా శిబిరం వద్ద విలేకర్లతో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
జగన్ నియంతృత్వ పోకడలను, అనాలోచిత నిర్ణయాన్ని అడ్డుకోవడానికి, అమరావతి రాజధానిని కొనసాగించేలా పోరాటం చేయడానికి బీజేపీ, జనసేనలు కలిశాయని భావిస్తున్నానన్నారు.
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీకి ఎదుటివారిపై బురదజల్లడం అలవాటుగా మారిందంటూ ఆయన విమర్శించారు.అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ ధోరణిలో మార్పు రాలేదన్నారు.151 సీట్లు ఉన్నాయని వైసీపీ ఏది పడితే అది చేస్తామంటే చూస్తూ ఎవరూ ఊరుకోరని, ఆయన తీసుకున్న నిర్ణయాలను అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని పుల్లారావు వ్యాఖ్యానించారు.జగన్ వైఫల్యాలు, అవగాహన లేని అనాలోచిత నిర్ణయాలతో అన్ని పార్టీలు అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తున్నాయన్నారు.చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవడం చేతకాక వైసీపీ ఎదుటివారిపై బురదజల్లుతోందని విమర్శించారు.