ఉగ్రవాదులను పట్టుకోవాల్సిన అధికారి వారికి సాయం చేసి తన ఉచ్చు ను తానే బిగించుకున్నట్లు అయ్యింది.శనివారం నాడు శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న దేవేందర్ సింగ్ ఉగ్రవాదులకు సాయం చేసినట్లు అధికారులు గుర్తించారు.
గతంలోనే దేవేందర్ సింగ్ పై ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ అధికారులు కేవలం బదిలీ తో సరిపెట్టారు.గతేడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీస్ పతకం కూడా అందుకున్నాడు.
ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే దేవేందర్ స్వచ్ఛందంగా జమ్ముకశ్మీర్లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్లో సబ్ ఇన్స్పెక్టర్గా చేరారు.కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకొచ్చిన ఈ విభాగాన్ని ప్రస్తుతం స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్గా పిలుస్తున్నారు.
కేవలం ఆరేళ్ల కాలంలో దేవేందర్ బద్గామ్ ఎస్ఓజీకి హెడ్గా ఎదిగారు.అయితే బాధ్యతగల ఆఫీసర్ గా వ్యవహరించాల్సిన దేవేందర్ డబ్బులకు ఆశపడి ఇలా ఉగ్రవాదులకు సాయం చేసినట్లు తెలుస్తుంది.
ఎస్ఓజీ డీఎస్పీ స్థాయి నుంచి సెంట్రల్ కశ్మీర్లో ఇన్స్పెక్టర్గా మార్చారు.అయితే ఆ తర్వాత దేవేందర్ ఆధ్వర్యంలో అనేక కస్టోడియల్ మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.
పార్లమెంట్ దాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఓ కేసులో దేవేందర్ అఫ్జల్ గురును అరెస్టు చేశారు.ఆ సమయంలో నిర్బంధ గృహానికి తీసుకొచ్చిన అఫ్జల్ను తీవ్రంగా హింసించినట్లు దేవేందర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం.పార్లమెంట్ దాడి ఘటనలోనే దేవేందర్ సింగ్ పేరు చెప్పాడు అఫ్జల్ గురు.అయితే దానికి సరైన ఆధారాలు లేకపోవడంతో.పోలీసులు దేవేందర్ పై చర్యలు తీసుకోలేకపోయారు.అయితే ఉగ్రవాదులు పోలీసులకు చిక్కకుండా దేవేందర్ సాయ పడుతున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలో అధికారులు నిఘా పెట్టడం తో దేవేందర్ ఇరుక్కున్నారు.
శుక్రవారం హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నవీద్ ముస్తాక్ ఫోన్ సంభాషణ నిఘా సంస్థల దృష్టికొచ్చింది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు చెక్ పోస్ట్ వద్ద పహారా కాసి దేవేందర్ ను అదుపులోకి తీసుకున్నారు.డబ్బు మీద అత్యాశతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
ఇద్దరు ఉగ్రవాదుల్ని పోలీస్ చెక్ పోస్టుల నుంచి సేఫ్ గా తీసుకెళ్లడానికి 12 లక్షల డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
దీనితో ఉగ్రవాదులకు సాయం చేసినందుకు గాను అతడిని కూడా ఉగ్రవాదిగానే భావిస్తామని కాశ్మీర్ ఐ జీపీ విజయ్ కుమార్ తెలిపారు.
విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది.కొంతకాలంగా ఉగ్రవాదులతో దవీందర్ టచ్లో ఉన్నాడని పోలీసులు గుర్తించారు.
బాదామిబాగ్ కంటోన్మెంట్లోని ఆర్మీ XV కార్ప్స్ హెడ్క్వార్ట్స్ సమీపంలో ఉండే తన నివాసంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడని విచారణలో వెల్లడయింది.శనివారంతో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు లాయర్ ఇర్ఫాన్ కూడా డీఎస్పీ ఇంట్లోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
డీఎస్పీ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు రెండు పిస్టల్స్, ఒక ఏకే 47 రైఫిల్, పెద్ద మొత్తంలో మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.శనివారం పోలీసులు అరెస్ట్ చేసిన రోజు దవీందర్ సెలవులో ఉన్నాడు.
శనివారం నుంచి గురువారం వరకు డ్యూటీకి సెలవులు పెట్టాడు.త్వరలో ఆయనకు ఎస్పీగా ప్రమోషన్ రావాల్సి ఉంది.
కానీ అంతలోనే ఉగ్రవాదులతో కలిసి పట్టుబట్టాడు దవీందర్.