సంక్రాంతి కానుకగా వరుస సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ సందడిగా మారింది.జనవరి 9న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన దర్బార్ సినిమా రిలీజ్ కాగా, జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల వైకుంఠపురములో సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అయోమయంలో పడేశాయి.
ఏ సినిమా చూడాలో, ఏ సినిమా చూడొద్దో అంటూ ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.కాగా ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు బ్లాక్బస్టర్ టాక్ను సొంతం చేసుకున్నాయి.
ఈ రెండు సినిమాల థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి.అయితే రెండు సినిమాలు బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో మరే సినిమాలు కూడా వీరి మధ్య పోటీకి వచ్చి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు.
కానీ నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం ఎంత మంచివాడవురా అనే సినిమాతో జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు, రెండూ బ్లాక్బస్టర్ టాక్ను సొంతం చేసుకున్నా తన సినిమాతో రిస్క్ చేస్తున్న కళ్యాణ్ రామ్ను చూసి ఇండస్ట్రీ జనాలు అవాక్కవుతున్నారు.
సినిమాలో కంటెంట్ ఉంటే ఎంతటి పెద్ద సినిమాల మధ్య వచ్చినా నిలబడి హిట్ కొట్టవచ్చని శతమానం భవతి సినిమా నిరూపించింది.ఇదే ధైర్యంతో తమ సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు కళ్యాణ్ రామ్ వెనకాడటం లేదు.
ఇది చూసి కళ్యాణ్ రామ్ సినిమా టైటిల్ ఎంత మంచివాడవురా కాకుండా ఎంత మొండివాడవురా అని పెట్టుంటే బాగుండేది అని అంటున్నారు సినీ క్రిటిక్స్.