అమరావతిలో రాజుకున్న రాజధాని మంటలు అన్ని పార్టీలకు ఇబ్బందికరంగా మారడంతో పాటు తీవ్ర రాజకీయ దుమారానికి తెర లేపుతోంది.అమరావతి నుంచి రాజధాని తరలించడానికి కుదరదని, ఈ ప్రాంతంలోని రాజధానిని అలాగే ఉంచి అభివృద్ధి చేపట్టాలంటూ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే కొంత మంది రైతులు ,ప్రజలు 20 రోజులకు పైగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
రాజధాని అమరావతి నుంచి తరలించడం లేదని, కేవలం పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగానే మరోచోట అభివృద్ధి చేస్తున్నామంటూ వైసీపీ చెబుతున్నా ఈ ఆందోళన కార్యక్రమాలు ఆగడంలేదు.
తాజాగా రాష్ట్రంలో వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుతూ, వైసిపి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా పెనుమాక నుంచి తాడేపల్లి భారత మాత విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ లో భారీ సంఖ్యలో ప్రజలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.అలాగే అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులు మరో ర్యాలీ చేపట్టారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు ఎమ్యెల్యే ఆర్కే ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఆయనకు మద్దతుగా వచ్చిన మహిళలు, నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆర్కే అరెస్ట్ సంచలనం రేకెత్తించడంతో భారీ ఎత్తున వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఆర్కేను విడుదల చేయాలంటూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.అధికార పార్టీ ఎమ్యెల్యే అరెస్ట్ కావడంపై అన్ని పార్టీలు ఈ వ్యవహారంపై ఆసక్తితో ఉన్నాయి.అయితే దీనిపై టీడీపీ మండిపడుతోంది.కేవలం రాజధానిని అమరావతిలో ఉంచాలని డిమాండ్ చేస్తున్నపోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకే ఆళ్ళ ఈ విధంగా ర్యాలీ చేపట్టారని, ఇదంతా వైసీపీ అధిష్టానం కుట్ర అంటూ మండిపడుతున్నారు.