రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ కెసిఆర్ మొదటి నుంచి స్నేహభావంతో ఉంటూ అనేక సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటూ ఏకాభిప్రాయానికి వస్తున్నారు.ఇక రాజకీయాలు పరంగానూ వైసిపి కి మద్దతుగా టిఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ కు మద్దతుగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఒకరికొకరు సహకరించుకుంటూ వస్తున్నారు.
ఈ క్రమంలో నేడు కెసిఆర్ జగన్ ప్రగతి భవన్ లో సమావేశం కాబోతుండడం అందరికి ఆసక్తి కలిగిస్తోంది.ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల సమస్యలతో పాటు జాతీయ రాజకీయాలపై లోతుగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.
దీనికోసమే ఈ సమావేశంలో జగన్ కేసీఆర్ తప్ప అధికారులు, మంత్రులు ఎవరు లేకుండా సమావేశాన్ని వారిద్దరి మధ్య పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా కేంద్ర అధికార పార్టీ బీజేపీ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేదానిపై చర్చించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.చాలా కాలంగా తెలుగు రాష్ట్రాలపై బిజెపి నిర్లక్ష్య ధోరణి తో ఉందని, కేంద్రం నుంచి సరైన సహకారం అందించడం లేదని జగన్, కేసీఆర్ భావిస్తున్నారు.ప్రధానంగా బిజెపి ప్రభుత్వం తెలంగాణలో పాగా వేసేందుకు టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని నిధులు విడుదల చేయకపోవడంలో పక్షపాత ధోరణి చూపిస్తోందని కెసిఆర్ ఆగ్రహంగా ఉన్నారు.
రాజకీయంగా తెలంగాణలో బలపడేందుకు చూస్తున్న బిజెపి టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుందనే అభిప్రాయంతో కెసిఆర్ ఉన్నారు.ఇక ఏపీ విషయంలోనూ అదే ధోరణి తో బిజెపి ముందుకు వెళుతోంది.
రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించడం మానేసి నిధులు విడుదల చేయడంలోనూ, ఏపీపై అదే నిర్లక్ష్యం వహిస్తుందని జగన్ కూడా భావిస్తున్నారు.తాను కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా కేంద్రం నుంచి అటువంటి సంకేతాలు రాకపోగా, తనను ఇరుకున పెట్టే విధంగా బిజెపి నాయకులు వ్యాఖ్యానించడాన్ని జగన్ తప్పు పడుతున్నారు .ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిజెపి విషయంపై పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.దీంతోపాటుగా సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు వ్యవహారం పై కూడా చర్చించుకుని ఒక ఏకభిప్రాయానికి రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.