అమరావతి వ్యవహారం లో ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక సతమతమవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో సెగ తగిలింది.కాకినాడలో జనసేన కార్యకర్తలను వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు దాడి చేయడం పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.
ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.కాకినాడలో జరిగిన సంఘటనకు జగన్ సమాధానం చెప్పాలని, ఈ విషయంలో వివాదానికి కారణమైన అసలు వ్యక్తులను వదిలేసి జనసేన నాయకులు మీద అన్యాయంగా కేసులు పెట్టారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను డిల్లీ మీటింగ్ ముగించుకుని నేరుగా కాకినాడ కి వస్తానని, అక్కడే తాడో పేడో తేల్చుకుంటాం అంటూ హెచ్చరించారు.
ఇంతకీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కొంత మంది జనసేన కార్యకర్తలు ఎమ్యెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించారు.అయితే వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడకు భారీగా చేరుకుని ఉన్నారు.దీంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ మరింత తీవ్రం కావడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.ఆ తర్వాత వైసీపీ జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.
దీనిపై పవన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే ద్వారంపూడి అనుచరులు జనసేన నాయకులను రాళ్లతో కొట్టి తరిమారని, ఎమ్మెల్యే అహంకారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ పవన్ సోదరుడు నాగబాబు వ్యాఖ్యానించారు.దీనిపై ద్వారంపూడి స్పందిస్తూ, తాను ఓ సామజిక వర్గాన్ని తిట్టానని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నేను అలా అనలేదు అంటూ వ్యాఖ్యానించారు.ఇక పవన్ ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ వస్తే పరిస్థితులు మరింత ఉధృతంగా మారే అవకాశం ఉంటుంది.
ఢిల్లీలో బీజేపీ పెద్దల వద్ద కు వెళ్లిన పవన్ ఇప్పుడు కాకినాడ వ్యవహారాలపైన కూడా ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటి వరకు అమరావతి వ్యవహారంలో తలనొప్పులు పడుతున్న వైసీపీకి ఇది మరో కొత్త తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది.