ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం రావణకాష్టంగా కాలుతున్నాయి.మూడు రాజధానులు అంటూ అగ్గి రాజేసి వదిలేసిన అధికార పార్టీ ఇప్పుడు ఆ అగ్గిని చల్లార్చడానికి నీళ్ళకి బదులు పెట్రోల్ పోస్తుందనే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది.
అమరావతిలో ఓ వైపు రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే అక్కడ పోలీసుల బలగాలతో రైతులని అనచేసే ప్రయత్నం చేస్తున్నారు.మరో వైపు విపక్షాలని రెచ్చగొడుతూ అరాచకాలు సృష్టిస్తున్నారు అనే మాట వినిపిస్తుంది.
వైసీపీ కాకినాడ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మీద అసభ్యకరమైన పదజాలంతో దూషించడంతో జనసేన కార్యకర్తలు కాకినాడలో శాంతియుతంగా నిరసన తెలియజేశారు.అయితే వారి మీద ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున రాళ్ళతో దాడి చేశారు.
ఈ ఘటనలో జనసేన కార్యకర్తలకి గాయాలు అయ్యాయి.
ఇదిలా ఉంటే ఈ ఘటన మీద ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ స్పందించారు.
తనపై ఎమ్మెల్యే వాడిన అసభ్యకరమైన భాషని అలాగే జన సైనికుల మీద దాడిని తీవ్రంగా ఖండించారు.అరాచక శక్తులతో దాడి చేయిస్తే వెనకడుగు వేస్తారనుకోవద్దని హెచ్చరించారు.సభ్య సమాజం ఛీత్కరించుకునే పదజాలంతో మాట్లాడిన ప్రజాప్రతినిధుల తీరుపై నిరసన తెలియజేస్తున్న కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడటం దురదృష్టకరమని పవన్ కల్యాణ్ అన్నారు.తప్పు అని చెబితే అరాచకశక్తులతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న ప్రజాప్రతినిధిపై జిల్లా పోలీస్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జనసేన కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే ఢిల్లీ పర్యటన నుంచి కాకినాడకు వచ్చి తాను రంగంలోకి దిగాల్సి వస్తుందని చెప్పారు.
మరి జనసేన హెచ్చరికల నేపధ్యంలో ఎమ్మెల్యేపై పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.