తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు.దేశ వ్యాప్తంగా ఆదరణ కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ అదే విధంగా తయారయింది.
నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రూపు తగాదాలు, జూనియర్ సీనియర్ బేధాలు ఇవన్నీ ఆ పార్టీ ఎదుగుదలకు ఇబ్బందికరంగా మారాయి.అయినా ఆ పార్టీ నేతల్లో ఇప్పటికీ స్పష్టమైన మార్పు కనిపించడం లేదు.
ఒకవైపు అధికార పార్టీ తమ లోపాలను అన్నిటిని చక్కదిద్దుకుంటూ మరింత శక్తివంతం అవుతుంటే కాంగ్రెస్ మాత్రం తమ ఇంటిని చక్కదిద్దుకునేందుకే సమయం అంతా వెచ్చిస్తూ ప్రజల్లో ఆదరణ కోల్పోతూ వస్తోంది.
ఇప్పటికే ఆ పార్టీ నాయకులు చాలామంది అధికార పార్టీ టిఆర్ఎస్, బీజేపీలో చేరి పోయారు.
మిగిలిన వారు కూడా అటుఇటుగా ఆలోచిస్తున్నారు.ఈ సమయంలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.
ఈ మేరకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది.అయితే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటిఫికేషన్ వాయిదా వేయాలంటూ కోర్టుకెక్కింది.
రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ప్రారంభిస్తారని, అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సమయం కూడా లేకుండా నోటిఫికేషన్ ఎలా ఇచ్చారంటూ దీనిని వాయిదా వేయాలని కోరుతూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో రెండు వాయిదాల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు.ఈ మేరకు ఎన్నికల సంఘం తీరును కోర్టు తప్పుపట్టింది.ఏడవ తేదీన విడుదల కావలసిన నోటిఫికేషన్ కూడా ఆపాలని కోరుతూ సోమవారం వ్యాఖ్యానించడంతో ఫైనల్ తీర్పుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
మంగళవారం జరిగిన విచారణ అనంతరం కోర్టు అభ్యన్తరాలన్నిటిని కొట్టివేయడమే కాకుండా, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు ప్రకటించినట్టుగానే యధావిధిగా విడుదల చేసుకోవచ్చు అంటూ తీర్పు చెప్పింది.దీంతో కాంగ్రెస్ నిరాశలో కూరుకుపోయింది.
తీర్పు వెలువడిన అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి ప్రకటించారు.కాంగ్రెస్ అభ్యంతరం చెప్పిన అన్ని విషయాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ఇక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలినట్టయ్యింది.
నోటిఫికేషన్ విడుదల ఆలస్యం అయితే ఈ లోపుగా బలం పుంజుకుని రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్లవచ్చని చూడగా, ఇప్పుడు ఆ విషయంలో కూడా ఫెయిల్ అయిపోవడం కాంగ్రెస్ ను మరింత ఇబ్బందులకు గురి చేసే విధంగా తయారయ్యింది.