ఎన్నికలు సమీపించే సమయంలో ఓటర్లు నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.అయితే ఈ ఓటరు నమోదు కార్యక్రమం జరిగే సమయంలో జిల్లా స్థాయిలో అధికారులు ఒకటికి మూడు సార్లు నివేదికలు, సవరణలు చేస్తూ ఉంటారు.
అయితే ఈ సవరణలు చేసిన తర్వాత కూడా ఒక్కోసారి పొరపాట్లు జారుతూ ఉంటాయి.చనిపోయిన వారికి ఓటు హక్కు కల్పించడం, అలాగే జంతువుల పేర్లు మీద కూడా ఓటు హక్కు రావడం జరుగుతుంది.
ఇలాంటి పొరపాటే ఇప్పుడు తెలంగాణలో జరిగింది.అధికారుల పొరపాటు వలన మూడేళ్ళ పాపకి ఓటు హక్కు వచ్చింది.
ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.పట్టణంలోని మారుతినగర్ కు చెందిన మూడు సంవత్సరాల వయసున్న మెతుకు శ్రీనందిత పేరిట ఫొటోతో కూడిన ఓటరు కార్డు జారీ అయ్యింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడదల కావడంతో అధికారులు ఓటర్ల జాబితాను విడుదల చేశారు.జాబితాలో ఎన్నో తప్పులున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి, ఏదో హడావిడిగా ఎలాంటి సవరణలు లేకుండా ఓటరు జాబితాలు విడుదల చేసారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఎన్నికలకి తక్కువ సమయం ఉండటంతో అధికారులు ఇన్ని రోజులు నిర్లక్ష్యంగా ఉండి ఇప్పుడు ఓటరు జాబితాని రిలీజ్ చేయడంతో తప్పులు జరిగాయి.ఈ నేపధ్యంలోనే చిన్నారి నందిత వయసును ఓటరు కార్డులో 35గా పేర్కొన్నారు.
అధికారులు ఈ విషయాన్ని గుర్తించకపోవడంతో ఓటరు కార్డు జారీ అయినట్లు సమాచారం.