అమరావతి రాజధాని వ్యవహారాల్లో వైసీపీ ప్రభుత్వాన్నిఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీకి కోరస్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అధికార వైయస్సార్ పార్టీ ఇప్పుడు పవన్ ను ఎక్కువగా టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుందనే విమర్శలు ఎక్కువయ్యాయి.ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పవన్ ను ఇబ్బంది పెట్టేందుకు వైసిపి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ప్రజలు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్న పవన్ గత టిడిపి ప్రభుత్వంలో అమరావతిలో రైతులు భూములు ఇచ్చేందుకు ఇష్టపడకపోయినా బలవంతంగా వారి భూములను సేకరించి ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో పవన్ వారికి బాసటగా నిలిచారు ఆ సందర్భంగా టిడిపి ప్రభుత్వం పై విమర్శలు చేయడమే కాకుండా అమరావతిలో రాజధాని ఏర్పాటు వ్యతిరేకిస్తున్నట్లు కూడా పవన్ మాట్లాడిన మాటలను ఇప్పుడు వైసిపి బయటకు తీసింది.
సోషల్ మీడియా ద్వారా అప్పట్లో పవన్ చేసిన వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ పవన్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.రాజధానిలో అన్ని వేల ఎకరాలు అవసరమా అంటూ పవన్ ప్రశ్నించిన తీరు కూడా వీడియో రూపంలో వైసిపి సోషల్ మీడియా లో పెట్టింది.అయితే ఈ వ్యవహారంపై పవన్ స్పందించారు.
రైతుల కష్టాలను వివరిస్తూ పవన్ మాట్లాడిన మాటలను పవన్ ఇప్పుడు వివరించారు.చంద్రబాబు ప్రభుత్వానికి ఇక్కడి రైతులు భూములు ఇచ్చారని, ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాకపోతే అప్పుడు రైతులు పరిస్థితి ఏంటని తాను ప్రశ్నించానని పవన్ చెప్పారు.
అధికారిక ధ్రువీకరణ పత్రం లేకపోతే రైతులకు నష్టం జరుగుతుందని, అధికారిక పత్రాలు, శాసనాల ద్వారానే జరిగితేనే రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారని అప్పటి ప్రసంగంలో పవన్ మాట్లాడారు.
తాను అమరావతిని గతంలో వ్యతిరేకించలేదని ఇప్పుడు పవన్ గట్టిగా చెబుతున్నారు.సోషల్ మీడియాలో తనను అనవసరంగా ఇబ్బందులు పెడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరిస్తే ఉద్యమిస్తామని మాత్రమే చెప్పాను అంటూ పవన్ చెబుతున్నారు.వైసిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ పెడుతున్నారో స్పష్టంగా పేర్కొంటూ అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజధాని అమరావతిలోనే ఉంటుంది అని ఒకసారి కాదు కాదు మూడు చోట్ల రాజధాని మరోసారి చెబుతూ గందరగోళ పరిస్థితులు తీసుకొస్తున్నారు అంటూ పవన్ మండిపడుతున్నారు.ఇవేవీ పట్టించుకోని వైసిపి గతంలో పవన్ చేసిన ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలనే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి జనసేన మైలేజ్ పెరగకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది అంటూ పవన్ మండిపడుతున్నారు.