ఏపీలో రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి.అధికారపక్షం, విపక్షాలు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉండడంతో ఈ రాజకీయాలు మరికాస్త వేడెక్కాయి.సభలో ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇప్పుడు 22 మంది హాజరవుతున్నారు.గన్నవరం ఎమ్మెల్యే వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా స్వతంత్ర ఎమ్మెల్యే గానే అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఇది తాము సాధించిన విజయంగా వైసీపీ చెప్పుకుంటోంది.ఇదే విధంగా మరికొంత మంది ఎమ్మెల్యేలను టిడిపి కి దూరం చేసి తాము అనుకున్న రాజకీయంతో ముందుకు తీసుకెళ్లాలని వైసిపి భావిస్తోంది.
ఇప్పటికే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను వల్లభనేని వంశీ పార్టీలో చేర్చుకోవాలని భావించినా వారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ లోకి వచ్చేందుకు వెనక ముందు ఆలోచిస్తున్నారు.ప్రస్తుతం ఏపీలో జగన్ పరిపాలన గురించి ప్రజల అభిప్రాయం ఏమిటో పూర్తిగా తెలుసుకున్న తరువాతనే పార్టీ మారే విషయంపై ఆలోచించాలని వారు భావిస్తున్నారు.అదే కాకుండా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండడంతో వాటి ఫలితాలను చూసి అధికార పార్టీ పరిస్థితి ఏమిటో అంచనా వేసి అప్పుడు టిడిపి లోనే ఉండాలా లేక వైసీపీ చెప్పిన విధంగా అనధికారికంగా వైసీపీలో చేరాలా అనే విషయంపై మథన పడుతున్నారు.ప్రస్తుత జగన్ పరిపాలన పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో జగన్ పరిపాలన ఏ విధంగా ఉందో తేలిపోతుంది.ఆ తర్వాత భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒక క్లారిటీ వస్తుంది.అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు.అది కాకుండా కేంద్రంలో వైసీపీకి సన్నిహిత సంబంధాలు ఈ మధ్యకాలంలో బాగా దెబ్బతిన్నాయి.ఏపీ బీజేపీ నేతలు వైసీపీ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంటే కేంద్ర బిజెపి పెద్దలు మాత్రం ఒకవైపు సానుకూలంగానే ఉంటూ మరోవైపు జగన్ ను ఇబ్బంది పెట్టే చర్యలకు దిగుతున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో టిడిపిని వీడాలనుకునే నాయకులంతా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
జగన్ బలం, బీజేపీ మద్దతు తదితర విషయాలపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే పార్టీ మారాలని చూస్తున్నారు.అంటే వేసవి కాలం లోనే టిడిపిలో ఉక్కపోత ఉంటుందనేది అర్థం అవుతోంది.