దేశంలో ఉల్లి లొల్లి రోజురోజుకు ఎక్కువవుతోంది.ఇప్పటికే ఉల్లి ధరలు తగ్గించాలంటూ ప్రజలు, రాజకీయ నేతలు నానా రచ్చ చేస్తున్నారు.
ఉల్లి లేకుండా వంటకాలు వండుతున్నట్లు పార్లమెంట్ సాక్షిగా నేతలు వాపోయిన సంగతి తెలిసిందే.అయితే ఉల్లి కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు ప్రజలు.
ఇటీవల ఏపీలోని గుడివాడలో ఓ వ్యక్తి ఉల్లి కోసం లైన్లో నిల్చుని ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి మరవకముందే, తాజాగా పంజాబ్ రాష్ట్రంలో ఓ మహిళ ఉల్లిని చోరీ చేసిందని పోలీసులు అరెస్ట్ చేశారు.
పంజాబ్లోని కపుర్తల గ్రేటర్ కైలాస్ ప్రాంతంలో నివసించే కిరణ్ అనే మహిళ తన ఇంట్లో సామాన్లతో పాటు ఉల్లి కూడా రోజురోజుకు తగ్గుతోందని గ్రహించింది.
దీంతో ఆమె ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.కాగా ఆమె ఇంట్లో పనిచేస్తున్న రేఖ స్టోర్ రూంలోకి వెళ్లి ఏదో వస్తువులు దాచుకుని వెళ్లినట్లు కిరణ్ గుర్తించింది.
దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.కాగా వారు సీసీ కెమెరాలు పరిశీలించి, రేఖను విచారించగా ఆమె అరకిలో ఉల్లి దొంగలించినట్లు ఒప్పుకుంది.
దీంతో కిరణ్ ఇంట్లో మాయమవుతున్న సామాన్లను కూడా రేఖ దొంగలించి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాగా రేఖను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆమెను తమదైన పద్ధతిలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.రాను రాను ఉల్లి కోసం ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.