కేంద్రంలో అధికారంలో ఉండడంతో తమకు బలం లేని ప్రాంతాల్లో ఇప్పుడే బలపడాలని అని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది.దీనిలో భాగంగానే తెలంగాణలో పూర్తిస్థాయిలో ద్రుష్టి పెట్టింది.
గతం కంటే ఇక్కడ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండడంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా తెలంగాణలో రెపరెపలాడించాలని ఆ పార్టీ భావిస్తోంది.మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు దక్కించుకున్నబిజెపిలో ధీమా మరింత పెరిగింది.
ముందు ముందు కూడా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.ఇప్పటికే టిఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కొంత మంది నాయకులను బీజేపీ చేర్చుకుంది.
ఇంకా మరికొంతమంది నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.ఈ దశలో తెలంగాణ బిజెపి అధ్యక్షుని కొత్తగా నియమించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.
ఈ మేరకు ఇప్పటికే అభిప్రాయ సేకరణ కూడా మొదలు పెట్టింది.
ఎవరికి వారు అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రస్తుతం తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ తో పాటు మరి కొంతమంది నాయకులు ఢిల్లీ పరిచయాలతో అధ్యక్ష పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారు.లక్ష్మణ్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి తాను ఇప్పటి వరకు పార్టీ పటిష్టతకు తీసుకున్న చర్యల గురించి ఢిల్లీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం.
ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లక్ష్మణ్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్టు ఆయన వర్గం చెప్పుకుంటోంది.ఇక బీజేపీ లో ఉన్న మిగిలిన సీనియర్ నాయకులతో పాటు ఇటీవల కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన కొంతమంది అధ్యక్ష పీఠం కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
అయితే ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం మరోసారి తనకి అధ్యక్ష పీఠం దక్కుతుందని నమ్మకంతో ఉన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి అందరి దృష్టిలో పడిన ధర్మపురి అరవింద్ కూడా అధ్యక్ష పీఠం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.తనకు కనుక పార్టీ పగ్గాలు అప్పగిస్తే బీజేపీని టిఆర్ఎస్ కు దీటుగా బలోపేతం చేస్తానని నమ్మకంతో చెబుతున్నారు.ఇక కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీ బండి సంజయ్ సైతం అధ్యక్ష పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆయనకు కొంతమంది సీనియర్ నాయకుల అండదండలు ఉండడంతో తనకే పీఠం దక్కుతుందని నమ్మకంతో ఉన్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలో చేరిన సీనియర్ మహిళా నేత డీకే అరుణ కూడా అధ్యక్ష పీఠం తనను వరిస్తుందని నమ్మకంతో ఉన్నారు.
బిజెపి కీలక నాయకుడు రామ్ మాధవ్ మద్దతు తనకు ఉందని, కాబట్టి అధిష్టానం తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తుందని చూస్తున్నారు.ఇలా ఎవరికి వారు తమకే తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి దక్కుతుందని ప్రయత్నాలు చేస్తూ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.