వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చేది క్రమశిక్షణ.పార్టీలో ఎంతటి వారైనా సరే జగన్ కు ఎదురు చెప్పకూడదని, ఆ పార్టీ అనధికారిక రూల్.
ఇక్కడ జగన్ మాటే శాసనంగా చలామణి అవుతుంది.అటువంటి పార్టీలో ఇప్పుడు కొంతమంది నాయకులు హద్దు మీరి ప్రవర్తిస్తుండడంతో జగన్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.
ఇటీవల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ గీత దాటి మరీ బిజెపి పెద్దలను కలవడం, ఆయనకు ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా పెద్దగా పట్టించుకోకపోవడం వంటి వాటిపై జగన్ గుర్రుగా ఉన్నారు.
సరిగ్గా ఇదే సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా మాఫియాలకు అడ్డాగా మారిపోయిందని, ఇక్కడ కబ్జా కోరులు, బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువై పోయారని, కొంతమంది మాఫియా గ్యాంగ్ కు ఈ జిల్లాను అప్పగించేశారు అని ఆనం పరోక్షంగా ఓ యువ మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇది బాగా వైరల్ కావడంతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి రంగంలోకి దిగారు.పార్టీ నేతలను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.పార్టీలో ఉన్న వారు ఎంతటివారైనా, క్రమశిక్షణ, విధేయత, జగన్ ఆశయాలు, ఆదేశాలు పాటించకపోతే సహించేది లేదని, ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే, తమ దృష్టికి తీసుకు రావాలి తప్ప మీడియా ముందు మాట్లాడటం ఏంటి అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.