తెలంగాణలో సంచలనం రేకెత్తించిన దిశ సంఘటన యావత్ భారతదేశాన్ని ఆలోచనలో పడేసింది.మహిళలకు రక్షణ లేకుండా పోయింది అంటూ ప్రతి చోటా నినాదాలు మారుమోగాయి.
ఈ సంఘటన తెలంగాణలో జరగడంతో కేసీఆర్ ప్రభుత్వం ఇంటా బయట అనేక విమర్శలు ఎదుర్కొంది.ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ సంఘటన జరిగిందని, దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలని అనేక డిమాండ్లు కూడా వినిపించాయి.
ఈ సంఘటన జరిగిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెప్పుకోవాలో పాలుపోని పరిస్థితుల్లో సైలెంట్ గా ఉండి పోయారు.ఇక జాతీయ మీడియా, ప్రతిపక్షాలు ఇలా అన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం గా చిత్రీకరించారు.
దేశంలో ఇంతకు ముందు ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినా ఈ స్థాయిలో ఆగ్రహావేశాలు చోటు చేసుకోలేదు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నివాసాలకు సమీపంలో ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగినా ఈ స్థాయిలో హైలెట్ అవ్వలేదు.కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో టార్గెట్ అయిపోయారు.సాక్షాత్తు పార్లమెంట్లో కూడా దిశ సంఘటన గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
దీనిని టీఆర్ఎస్ ను ఇరికించే అవకాశంగా మలుచుకోవాలని బిజెపి పెద్దలు కూడా ప్రయత్నించారు.తెలంగాణలో శాంతిభద్రతలు అదుపులో లేవని, కేసీఆర్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో పూర్తిగా విఫలం అయ్యిందని, ఇలా అనేక విమర్శలను కెసిఆర్ ఎదుర్కొన్నారు.
ఇక ఈ సంఘటనకు కారణమైన నిందితులకు ఉరిశిక్ష వేయాలని, ఎన్ కౌంటర్ చేయాలని ఇలా అనేక డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున రావడంతోపాటు ఈ సంఘటన ప్రభుత్వానికి మాయని మచ్చగా మారడం తో కెసిఆర్ కూడా ఆలోచనలో పడ్డాడు.
ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం దిశా సంఘటన నిందితులు నలుగురు పోలీస్ ఎన్ కౌంటర్ లో మృతి చెందడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ విషయం టిఆర్ఎస్ పెద్దలకు తెలిసి జరిగినా తెలియక జరిగినా క్రెడిట్ మొత్తం కేసీఆర్ కే దక్కింది.తనను ఈ విషయంలో ఇప్పటి వరకు టార్గెట్ చేసుకుంటూ వస్తున్న వివిధ రాజకీయ పార్టీలకు కెసిఆర్ ఒక్క ఎన్ కౌంటర్ తో సమాధానం చెప్పేసాడు
.