జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పేరు పెట్టి పిలవాలంటే ఏదోలా ఉందని బీజేపీ ఎమ్యెల్యే రాజాసింగ్ చెబుతూనే పవన్ మీద ఆయన విమర్శలు చేశారు.తాజాగా హిందువుల విషయంలో పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజాసింగ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
ప్రజలను మతాల పేరుతో విడగొడుతూ రాజకీయాలు చేస్తుంది హిందు రాజకీయ నేతలేనని తిరుపతి లో జరిగిన జనసేన కార్యకర్తల మీటింగ్ లో పవన్ వ్యాఖ్యానించారు.
దీనిపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ అసలు హిందువా, కాదా ? జనసేన పార్టీలో హిందువులే లేరా ? అని రాజాసింగ్ ప్రశ్నల వర్షం కురిపించారు.హిందువుల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు.
‘ఖబర్దార్.పవన్ కళ్యాణ్’ అంటూ రాజాసింగ్ పవన్ ను హెచ్చరించారు.
ఈ మేరకు నిన్న రాత్రి ఓ వీడియో విడుదల చేశారు.హిందువులు కొట్లాటలు పెట్టే వారన్నట్టుగా పవన్ మాట్లాడుతున్నారు.
పవన్ కళ్యాణ్ హిందువేనా ? వేరే మతంలోకి వెళ్ళారా ? అంటూ ఆయన ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ హిందూ సమాజాన్ని టార్గెట్ చేశారని, హిందూ సమాజం గూర్చి పవన్ కు తెలియదనుకుంటా అని అన్నారు.
అలాగే ఎన్నికలు అయిపోయాయి కదా, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావ్? హిందూధర్మం ఉండొద్దనుకుంటే నేరుగా చెప్పండి అంటూ ఆయన మండిపడ్డారు.