చదువుకున్న అమ్మాయి ముందుగా సాయం కోసం 100 కి కాల్ చేయకుండా చెల్లికి చేసింది అంటూ పలువురు నెటిజన్ల తో పాటు రాజకీయ నాయకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఆమె ముందు జాగ్రత్త చర్య ఫలితంగానే పోలీసులు ఇంత ఈజీ గా షాద్ నగర్ ఘటన నిందితులను పట్టుకోగలిగారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం,హత్య కేసులో ఇద్దరు డ్రైవర్లు,ఇద్దరు క్లీనర్లను అదుపులోకి తీసుకొని 14 రోజుల రిమాండ్ కు కూడా తరలించిన సంగతి తెలిసిందే.అత్యంత పాశవికంగా పక్కా ప్రణాళిక తో ప్రియాంక ను ట్రాప్ చేసి మరి దారుణానికి ఒడిగట్టి చివరికి ప్రాణాలను సైతం బలితీసుకొని చివరికి ఎలాంటి సాక్ష్యాలు దొరకకూడదు అన్న ఉద్దేశ్యం తో పెట్రోల్ కూడా పోసి తగులబెట్టారు.
ఇంత ఘోరంగా ప్రవర్తించిన ఆ నిందితులను పట్టుకోవడం లో బాధితురాలి ఫోన్ పోలీసులకు క్లూ గా మారింది.బాధితురాలు తన చుట్టూ ఉన్న పరిస్థితులను చెల్లికి వివరించడం కోసం ఫోన్ చేసిన తరువాత, ఆమె ఫోన్ 9:48 నిమిషాలకు స్విచ్ ఆఫ్ అయిపొయింది.అయితే ఆమె ఫోన్ కాల్స్ ను చూడగా చెల్లికి ఫోన్ చేసిన తరువాత మరో కాల్ చేసింది.
అదే ఈ ఘటనలో ఏ1 నిందితుడు గా ఉన్న మహమ్మద్ ఆరిఫ్ నంబర్.
తన స్కూటీ రిపేర్ చేయించడం కోసం అని దగ్గరకు వచ్చి సాయం చేస్తామని నమ్మబలికిన ఆరిఫ్ స్కూటీ తీసుకొని వెళ్ళేటప్పుడు ముందు జాగ్రత్త చర్యగా అతడి నెంబర్ ను తీసుకుంది.అయితే స్కూటీ తీసుకెళ్లిన ఆరిఫ్ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడం తో ప్రియాంక అతడి నెంబర్ కు కాల్ చేయడం అది ఆమె ఫోన్ కాల్స్ లో రికార్డ్ అవ్వడం తో పోలీసులు ఈ కేసు ను ఛేదించడం లో సాయ పడినట్లు అయ్యింది.
ఆమె కాల్ డేటా ఆధారంగా ఆ నెంబర్ ను గుర్తించిన అధికారులు అతడి లారీ ని చెక్ చేయగా క్యాబిన్ లో రక్తపు మరకలు ఉండడం గమనించిన అధికారులు అతడిని అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం వెల్లడించాడు.దీనితో ప్రియాంక రెడ్డి తెలివిగా అతడి ఫోన్ నెంబర్ తీసుకోవడం, మరలా తిరిగి ఆ నెంబర్ కు ఫోన్ చేయడం తోనే పోలీసులు చాలా ఈజీ గా ఈ మిస్టరీ ని ఛేదించగలిగారు.
మరోపక్క ప్రియాంక రెడ్డి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటూ ముగ్గురు అధికారులపై వేటు పడినట్లు తెలుస్తుంది.విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఎస్సై రవికుమార్ హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్య నారాయణ గౌడ్ లను సస్పెండ్ చేశారు.
ప్రియాంక తల్లితండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలతో ఈ వేటు పడింది.ఈ ఘటనతో “సైబరాబాద్ పోలీసు అధికారులందరికీ మరోసారి అధికార పరిధితో సంబంధం లేకుండా కేసులు నమోదు చేయాలని” ఆదేశాలు ఇవ్వబడ్డాయి.రెండు పోలీస్ స్టేషన్ల మధ్య అధికార పరిధిపై పోలీసులు చాలా సమయం వృధా చేయడమే కాకుండా, తగని ప్రశ్నలు కూడా అడిగి సమయం వృధా చేసినట్లు కన్ఫర్మ్ చేసుకున్న అధికారులు వారిపై వేటు వేసినట్లు తెలుస్తుంది.