ఆధునిక యుగంలో శాస్త్రీయ సంగీతం పట్ల మక్కువ తగ్గించుకుంటున్న భారతీయులు పాశ్చాత్య సంగీతానికి ఆకర్షితులవుతున్నారు.అయితే విద్య, ఉపాధి అవకాశాల కోసం ఇతర దేశాల్లో స్ధిరపడిన భారతీయులు మాత్రం మన శాస్త్రీయ సంగీతాన్ని కాపాడుతున్నారు.
ప్రస్తుతం అమెరికాలో కర్ణాటక సంగీతం విపరీతమైన ప్రజాదరణను పొందుతోంది.అక్కడి ఎన్ఆర్ఐలతో పాటు అమెరికన్లు సైతం కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుని అద్భుతంగా రాణిస్తున్నారు.
భారతీయ ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన సంగీత పాఠశాలలే కాకుండా, భారతీయులు తమ కళను ప్రదర్శించడానికి అమెరికాలో అనేక వేదికలు ఉన్నాయి.
తెలుగు, తమిళ, కేరళ మరియు కన్నడ సంస్థలు శాస్త్రీయ సంగీతంతో పాటు నృత్య శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
కర్ణాటక సంగీతంతో పాటు భారతీయ శాస్త్రీయ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలను అమెరికాలో ఎదుగుతున్న చిన్నారులకు పరిచయం చేసేందుకు తాము కృషి చేస్తున్నట్లు ఇండియన్ రాగా కో ఫౌండర్, సీఈవో శ్రీరామ్ ఎమాని తెలిపారు.అమెరికాలోని చిన్నారులు విద్య, కళలు, క్రీడలు ఇలా అన్ని రంగాల్లో అభ్యున్నతిని సాధించాలని అక్కడి విద్యావేత్తలు చెబుతున్నారు.
కర్ణాటక సంగీతం యొక్క బలమైన నిర్మాణం, బోధన కారణంగా పిల్లలు దీనికి త్వరగా ఆకర్షితులవుతున్నారని పలువురు భారతీయులు చెబుతున్నారు.
ఇండియన్ రాగా 2012లో స్థాపించబడింది.ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన సంగీతకారులు, నృత్యకారులను కలిపే నెట్వర్క్లలో ఇది ఒకటి.ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంతో పాటు ఇటీవలి హౌడీ మోడీ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై ఇండియన్ రాగా ప్రదర్శనలు ఇచ్చింది.
ఈ సంస్థ 7 దేశాల్లో, 40కి పైగా నగరాల నుంచి కార్యకలాపాలను సాగిస్తోంది.
అలాగే భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని సజీవంగా ఉంచడంతో పాటు సంగీత కళను నేర్చుకోవటానికి ఆసక్తిగా ఉన్న విద్యార్ధులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విశాఖకు చెందిన వీణా పందిరి 2011లో వర్జీనియాలో నోట్స్ ఎన్ బీట్స్ అనే సంస్థను స్థాపించారు.
ఈ సంస్థ అమెరికన్ల కోసం శాస్త్రీయ సంగీత శిబిరాలను నిర్వహించింది.సంగీతంతో వ్యాధులను నయం చేయవచ్చు అంటున్నారు వీణా పందిరి…తాను క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్నప్పుడు ఇబ్బందులను అధిగమించడానికి సంగీతం తనకు ఎంతగానో సాయపడిందని ఆమె తెలిపారు.
అందువల్ల ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు, అంగవైక్యలం వున్న చిన్నారులకు తాను చేరువవుతున్నట్లు వీణ పేర్కొన్నారు.
విశాఖకు చెందిన పి ఉమారాణి మాట్లాడుతూ.
గత కొన్నేళ్లుగా తాను సంగీత తరగతులు నిర్వహిస్తున్నానని.ఈ క్రమంలో విదేశాలలో ఉన్న వారి కోసం స్కైప్ ద్వారా ఆన్లైన్ క్లాసికల్ మ్యూజిక్ క్లాసులు చెబుతున్నట్లు ఉమ వెల్లడించారు.
ప్రస్తుతం ఆమె అమెరికాలో 20 మంది విద్యార్ధులకు సంగీతాన్ని నేర్పిస్తున్నారు.భారతీయ విద్యార్ధులతో పాటు అమెరికన్ విద్యార్ధులు సైతం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని ఉమ తెలిపారు.
తాను బోధించే విద్యార్ధుల్లో ఎక్కువ మంది 7 నుంచి 30 సంవత్సరాల వయస్సు వారేనని.ఇదే సమయంలో 60 ఏళ్ల విద్యార్ధులు కూడా ఉన్నట్లు ఆమె వెల్లడించారు.