కృష్ణా జిల్లా ముసునూరులో ఓ రెవెన్యూ ఉద్యోగి రెచ్చిపోయాడు.కులధృవీకరణ పత్రాల కోసం వచ్చిన ఓ దరఖాస్తుదారుడిపై రెవెన్యూ అధికారి పిడిగుద్దుల వర్షం కురిపించాడు.
మద్దాల బాబూరావు అనే వ్యక్తి బుధవారం ముసునూరు తహశీల్దార్ కార్యాలయానికి కులధృవీకరణ పత్రాల కోసం వచ్చాడు.వారం రోజులుగా కులధృవీకరణ పత్రం కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోయిన బాబూరావు అధికారులపై మండిపడ్డాడు.
లంచం ఇస్తేగాని పనిచేయరా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.దీంతో కంప్యూటర్ ఆపరేటర్ పవన్ కుమార్ కోపంతో ఊగిపోయి బాబూరావుపై దాడికి దిగాడు.
కోపంగా వచ్చి అతడి గొంతుపట్టుకుని పిడిగుద్దులు విసిరాడు.ఈ దాడితో అక్కడే ఉన్న కొందరు అప్రమత్తమై పవన్ను అడ్డుకున్నారు.
దీంతో పవన్ తనపై దాడికి దిగాడంటూ బాబూరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా పవన్ కూడా బాబూరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ దాడిలో బాబూరావు కంటికి గాయమైనట్లు తెలుస్తోంది.ఒకవైపు రెవెన్యూ అధికారులపై దాడులు ఆపాలాంటూ తెలంగాణలో ఉద్యమాలు జరుగుతుంటే, ఏపీలో ప్రజలపై రెవెన్యూ అధికారుల దాడులు ఏమిటని పలువురు ఖండిస్తున్నారు.