గ్రామం అంటే వందల మంది జనాలతో కళకళలాడుతూ ఉంటుంది.కాని ఆ గ్రామం మాత్రం మోడుబారిన చెట్టు మాదిరిగా ఉంటుంది.
గ్రామంలో ఇళ్లు చాలానే ఉన్నా ఆ ఇళ్లలో జనాలు ఉండరు.ఆధరణ నోచుకోని పాడుబడ్డ ఇళ్లు మాదిరిగా ఆ గ్రామం మారిపోయింది.
గతంలో దాదాపుగా 600 మంది జనాబా ఉన్న ఆ ఊర్లో ఇప్పుడు కేవలం ఒకే ఒక్క వృద్దుడు జీవిస్తున్నాడు.అతడు పుట్టి పెరిగిన ఊరును వదిలేయడం ఇష్టం లేక ఆ గ్రామంలో ఒంటరిగా ఉంటున్నాడు.
అలాంటి వింత గ్రామం ఏ విదేశాల్లోనో లేదా ఉత్తర భారతదేశంలోనో లేదు.మన తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది.జమ్మలమడుగు మండలం పొన్నతోట పంచాయితీ కిందకు వచ్చే దప్పెర్ల గ్రామం.ఆ గ్రామంలో ఒకప్పుడు అన్ని గ్రామాల్లో మాదిరిగా జనాలు కళకళలాడుతూ ఉండేవారు.
కాని భూమి పంచాయితీ కారణంగా ఒక రిటైర్డ్ టీచర్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.అప్పటి నుండి కూడా పోలీసులు హత్య కేసు ఎంక్వౌరీకి గ్రామస్తులను ప్రశ్నిస్తూ వచ్చారు.
1991 నుండి పోలీసులు గ్రామస్తులను రోజు ఏదో ఒక విధంగా ప్రశ్నిస్తూనే ఉండేవారు.పోలీసులు పదే పదే గ్రామానికి వస్తున్న నేపథ్యంలో ఇక తట్టుకోలేక ఒక్కరు ఒక్కరు చొప్పున గ్రామాన్ని వదిలేసి వెళ్లారు.గ్రామంలో చివరకు శేషందానం కుటుంబం మాత్రమే మిగిలి ఉంది.కొన్నాళ్ల వరకు ఆయన కుటుంబం అదే గ్రామంలో ఉంది.కాని పిల్లల చదువు నిమిత్తం వారు కూడా వెళ్లి పోవడంతో వృద్ద దంపతులు మాత్రమే గ్రామంలో మిగిలి పోయారు.
చాలా ఏళ్లుగా ఆ వృద్ద దంపతులు గ్రామంలో ఒంటరిగా ఉంటూ వస్తున్నారు.గత ఏడాది వృద్దురాలు చనిపోయింది.దాంతో ఇప్పుడు ఆ గ్రామంలో ఒకే ఒక్క వృద్దుడు మిగిలి ఉన్నాడు.
అతడు పక్క గ్రామం నుండి రేషన్ తీసుకు వచ్చి, ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్ను పొందుతూ జీవనంను సాగిస్తున్నారు.ఈ గ్రామంకు చెందిన వారి వ్యవసాయ భూములు అన్ని కూడా పక్క గ్రామాల వారు కొనుగోలు చేశారు.
తమ గ్రామంపై మక్కువ ఉందని, కాని మళ్లీ ఆ గ్రామానికి వెళ్లాలనుకోవడం లేదు అంటూ చాలా మంది అంటున్నారు.