అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన విభిన్నమైన మనస్తత్వాన్ని చాటుకున్నారు.ఓ వైపు కాలిఫోర్నియాలో దావాగ్ని వేలాది ఎకరాల అటవీని, నివాస ప్రాంతాలను కాల్చిబుగ్గి చేస్తుంటే ఆదుకోవాల్సింది పోయి… ఫెడరల్ నిధులను తగ్గిస్తామంటూ బెదిరించారు.
కార్చిచ్చును అదుపుచేయడంలో కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ విఫలమయ్యారంటూ ట్రంప్ ఫైరయ్యారు.ఈ ఏడాది రాష్ట్రంలో పలు మార్లు కార్చిచ్చు చెలరేగి లక్షల హెక్టార్ల అడవి కాలిపోయింది.
ప్రతి సంవత్సరం కార్చిచ్చు రేగడం.కాలిఫోర్నియా గవర్నర్ ఆర్ధిక సాయం కోసం ఫెడరల్ ప్రభుత్వం వద్దకు రావడం ఆనవాయితీగా మారిపోయింది.ఇక చాలు, గవర్నర్గా మీ విధులు నిర్వర్తించండి అంటూ ట్రంప్ ట్విట్టర్లో పేర్కొన్నారు.ఆ వెంటనే స్పందించిన గవర్నర్ న్యూసోమ్ అధ్యక్షుడి పర్యావరణ విధానాలను తీవ్రంగా విమర్శించారు.
మీరు వాతావరణ మార్పులను విశ్వసించరని.కానీ మీరు క్షమించబడతారని వ్యాఖ్యానించారు.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా శీతాకాలం ఎంత తడిగా ఉన్నప్పటికీ కార్చిచ్చులకు కారణమవుతున్నాయని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది.పొడి, వేడి వాతావరణాల కారణంగా వృక్ష సంపద ఎండిపోయి మంటలు త్వరగా వ్యాపించడానికి కారణమవుతున్నాయని అధ్యయనం తెలిపింది.గతేడాది కాలిఫోర్నియా చరిత్రలోనే అత్యంత ఘోరమైన కార్చిచ్చు కారణంగా 86 మంది చనిపోయినప్పుడు కూడా ఫెడరల్ ఆర్ధిక సాయాన్ని తగ్గిస్తానని ట్రంప్ ఇదే రకంగా భయపెట్టారు.గురువారం సంభవించిన మంటల కారణంగా 9,400 ఎకరాల అటవీభూమి దగ్థమైనట్లు వెంచురా కౌంటీ అగ్నిమాపక విభాగం ఆదివారం ప్రకటించింది.
అక్టోబర్ 23న చెలరేగిన కార్చిచ్చు ఇప్పటి వరకు 80,000 హెక్టార్ల అడవిని కాల్చిబూడిద చేయగా… వేలాది మందిని నిరాశ్రయులను చేసింది.