తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె తీవ్రతరం అవుతుంది.నిన్న కేసీఆర్ మాట్లాడుతూ సమ్మె చేయడం అంటే ఆర్టీసీని చంపేయడమే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
అయినా కూడా ఆర్టీసీ కార్మికులు మాత్రం సమ్మె విడవడం లేదు.ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకుడు అశ్వత్థామరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కొందరు కావాలని ఆయనతో ఈ సమ్మెను చేయిస్తున్నారు అంటూ మొదటి నుండి ఆరోపణలు వస్తున్నాయి.
నేడు అశ్వత్ధామ రెడ్డిపై ఒక ఆర్టీసీ డ్రైవర్ పోలీసు కేసు పెట్టాడు.
సమ్మె ఆయన వల్లే జరుగుతుందని, ఆయన మూర్ఖపు పట్టుదల వల్ల ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ ఆయన కేసులో పేర్కొనడం జరిగింది.సమ్మెలో పాల్గొనకుంటే బలవంతంగా పాల్గొనేలా చేస్తున్నారని, చాలా మంది కార్మికులకు సమ్మె చేయడం ఇష్టం లేకున్నా ఆయన ఒత్తిడి వల్ల చేస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
కార్మికులను భయపెట్టి సమ్మె చేయిస్తున్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేయాలంటూ రాజు అనే డ్రైవర్ డిమాండ్ చేశాడు.ఈ కేసుతో ఆర్టీసీ సమ్మె కొత్త పుంతలు తొక్కుతుందని, ఇది ఎక్కడికో దారితీస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.