ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీ మొత్తం ఫ్యాను గాలి బలంగా వీచింది.ఆ దెబ్బకు అత్యంత బలమైన పార్టీగా, సుదీర్ఘకాలంగా రాజకీయాలను శాసిస్తున్న తెలుగుదేశం పార్టీ కూడా అవమానకరమైన రీతిలో ఫలితాలను చవి చూడాల్సి వచ్చింది.175 స్థానాలకు గాను కేవలం 23 స్థానాలకే ఆ పార్టీ పరిమితం అయిపొయింది.ఇక కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీ పరిస్థితి అయితే చెప్పనవసరంలేదు.
కేవలం ఒక్క సీటుకే ఆ పార్టీ పరిమితం అయిపొయింది.తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ మాత్రమే గెలుపొందారు.అసెంబ్లీలో జనసేనకు ఒకే ఒక్కడిగా ఆయన గొంతెత్తుతున్నాడు.ఇంత వరకు బాగానే ఉన్నా ఆయన జనసేన పార్టీలో ఉంటూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం రాజకీయంగా పెద్ద చర్చే నడుస్తోంది.
ఆయన జనసేన పార్టీలో ఉన్నా వైసీపీ ఎమ్యెల్యేగా వ్యవహరిస్తుండడం జనసేన పార్టీ నాయకులకు రుచించడంలేదు.
ఒక వైపు చూస్తే జనసేన పార్టీ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతూ ప్రధాన ప్రతిపక్షం తామే అన్న రీతిలో వ్యవహారం చేస్తోంది.
పవన్ టార్గెట్ మొత్తం వైసీపీ మీదే పెట్టి రాజకీయం చేస్తుంటే ఆ పార్టీ ఏకైక ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం అందుకు విరుద్ధంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు.రాపాకపై అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం జగన్ చిత్రపటానికి రాపాక పాలాభిషేకం చేయడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది.
అదీ కాకుండా ఆయన వైసీపీ మంత్రితో అత్యంత సన్నిహితంగా ఉండడం జనసేన కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది.
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, వైసిపి మంత్రి పినిపే విశ్వరూప్ ఎప్పటి నుంచో మంచి స్నేహితులు.వారు ఇప్పుడు వేరు వేరు పార్టీల్లో ఉన్నా పాత స్నేహం మాత్రం కొనసాగిస్తున్నారు.ఇటీవల అమలాపురం నియోజకవర్గంలో ఆటో కార్మికులకు, వైఎస్సార్ వాహన మిత్ర ప్రకటించిన నేపథ్యంలో మంత్రి విశ్వరూప్ను ఘనంగా సన్మానించారు.
అక్కడ వరకు బాగానే ఉన్నా అదే కార్యక్రమానికి రాజోలు ఎమ్మెల్యే, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ రాపాక వరప్రసాద్ హాజరయ్యారు.పనిలో పనిగా మంత్రి విశ్వరూప్ తో కలిసి కేక్ను కట్ చేశారు.
ఆటో కార్మికుల కోరిక మేరకు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఇదే ప్రస్తుతం జనసేన వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. జగన్ చిత్రపటానికి రాపాక పాలాభిషేకం చేయడం, జగన్ ను అవకాశం దొరికినప్పుడల్లా ప్రశంసించడం చూస్తుంటే ఆయన అనధికారికంగా వైసీపీలో చేరినట్టేనా అనే సందేహాలు కలుగుతున్నాయి.దీనికి తోడు ఎన్నికల్లో రాపాక గెలుపులో కీలక పాత్ర పోషించిన కెఎస్ఎన్ రాజు, మాజీ ఎమ్మెల్యే అల్లు కృష్ణంరాజు జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
ఈ నేపథ్యంలోనే రాపాక వైసీపీకి అనుకూలంగా మారిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.అధికారికంగా వైసీపీలో చేరితే అనర్హత వేటు పడుతుంది అన్న ఉద్దేశంతో ఇలా పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్టు స్పష్టంగా అర్ధం అవుతోంది.