ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన విషయం తెల్సిందే.పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటీ అంటే రేవంత్ రెడ్డి తనకు సన్నిహితంగా ఉండే వారితో కలిసి ఈ కార్యక్రమంను చేపట్టాడు.ఈ ప్రగతి భవన్ ముట్టడికి సంబంధించి పార్టీ ముఖ్య నాయకులకు చెప్పక పోవడంతో పాటు, కనీసం వారిని రావాల్సిందిగా ఆహ్వానించలేదని సీనియర్లు గుర్రుగా ఉన్నారు.
రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమంపై సీనియర్ నాయకులు వి హనుమంతరావు, భట్టి విక్రమార్క, సంపత్ ఇంకా కొందరు నాయకులు కూడా సీరియస్గా ఉన్నారు.పార్టీ కార్యక్రమంగా చేయాల్సింది పోయి వ్యక్తిగతంగా చేయడం ఏంటీ అంటూ వారు ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి తీరు మొదటి నుండి ఇలాగే ఉందని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.ప్రగతి భవన్ ముట్టడితో కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే సీనియర్లు మాత్రం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న పరిస్థితికి ఈ పద్దతే కారణం.ఒకరు పై చేయి సాధించడం, ఫేమ్ అవ్వడం కాంగ్రెస్లో ఇతర నాయకులు అస్సలు భరించలేరు.ఇదే కాంగ్రెస్కు పెద్ద మైనస్ అవుతుంది.