అధికార పార్టీని ఇరుకున పెడుతూ తెలుగుదేశం పార్టీ గత కొంతకాలంగా హడావుడి చేస్తూ ప్రజా ఉద్యమాలను చేపడుతోంది.రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తూ పార్టీలో ఒకరకమైన ఉత్సాహం పెరిగేలా అధినేత చంద్రబాబు రాజకీయం నడిపిస్తున్నాడు.
అయితే ప్రభుత్వంపై ఎన్ని పోరాటాలు చేసినా, ప్రధాన ప్రతిపక్షంగా సమర్ధవంతమైన పాత్రనే పోషిస్తున్నా ఆశించిన స్థాయిలో పార్టీలో మాత్రం ఆశించిన మైలేజ్ రావడం లేదనే బాధ అధినేతలో స్పష్టంగా కనిపిస్తోంది.బాబు ఎంత భరోసా ఇస్తున్నా పార్టీ నాయకుల్లో మాత్రం ఎక్కడలేని భయం, ఆందోళన కనిపిస్తున్నాయి.
ఇప్పటి నుంచే పార్టీని యాక్టివ్ చేసి వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేయాలని చూస్తున్నా ఆ ఊపు నాయకుల్లో కనిపించడంలేదు.
రాజకీయంగా తన వారసుడు లోకేష్ ను బలమైన నాయకుడిగా తీర్చిదిద్ది రాబోయే రోజుల్లో పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు.టీడీపీ నుంచి ఇప్పటికే కొంతమంది సీనియర్ నాయకులు, కీలకమైన పదవులు పొందిన వారు లోపాయికారీగా పార్టీ మారి పోయిన విషయం అందరికి తెలిసిందే.వారు పార్టీ మారడం వెనుక అనేక కారణాలు, వ్యాపారాలు ఉన్నాయి.
కాబట్టి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కూడా వారిపై ఒత్తిడి పెరుగుతోంది.దీంతో కొంతకాలంగా వరుస పెట్టి నాయకులు కూడా పార్టీ మారుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నిజానికి ఈ వలస లను అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.పార్టీని బలోపేతం చేయడంలో భాగంగానే ప్రజా పోరాటాలు చేస్తూ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నాడు.
ప్రభుత్వంపై వ్యూహాత్మకంగా విమర్శలు చేస్తూ ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు.ఓటమి నుంచి తొందరగానే పార్టీని తేరుకునేలా చేసి ఆ చేదు అనుభవాల నుంచి పార్టీ నాయకులు బయటపడేలా చేస్తున్నాడు.అయినా బాబు చేస్తున్న ప్రయత్నాలు ఏమీ పెద్దగా సక్సెస్ అవుతున్నట్టు కనిపించడంలేదు.బాబు ఎంత చేసినా నాయకుల్లో ఎక్కడో అసంతృప్తి చెలరేగుతూనే ఉంది.చంద్రబాబు నాయకత్వంపై నాయకులకు నమ్మకం తగ్గడం వల్లే ఈ విధమైన పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తోంది.ఇప్పటి వరకు పార్టీ మారిన వారిలో కొంతమందికి మాత్రమే వ్యాపారాలు ఉండగా మిగతా వారంతా టీడీపీ ఇప్పట్లో కోలుకోలేదనే భావనలోకి వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది.