టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకస్థుల్లో ఒక్కడిగా బాబు కోటరీ నాయకుడిగా పేరుపొందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.తన వ్యాపారాలు, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
ఆయన బీజేపీలోకి వెళ్లినా తరుచు ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతుండడం అనేక అనుమానాలు కలిగిస్తూనే ఉంది.అయితే తాను బీజేపీ లో ఉన్నాను కాబట్టి తన జోలికి ఎవరూ రారు అనే ధీమా కూడా సుజనలో కనిపిస్తూ వచ్చింది.
అయితే ఇప్పుడు మాత్రం వైసీపీ సుజనా చౌదరి ని టార్గెట్ చేసుకున్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.తాజాగా కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో వారం రోజులుగా ఏపీ రెవిన్యూ అధికారులు మకాం వేశారు.
ప్రతీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ను నిశితంగా పరిశీలిస్తున్నారు.అనేక గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
టార్గెట్ మాత్రం సుజనా అన్నట్టుగానే ఈ సోదాలు జరుగుతున్నాయి.ఇది సుజనా చౌదరికి చెందిన భూమినా, ఈ భూములు సుజనా చౌదరి బినామీలకు చెందినవా, సుజనా చౌదరి 2014 నుంచి కొనుగోలు చేసిన భూమి ఎంత, వారి బంధువుల భూమి ఎంత అంటూ ఆరాలు తీస్తూ మరీ సోదాలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఏపీ రాజధాని అమరావతిలో 2010 నుంచి ఒక్క అంగుళం భూమినైనా తాను కొనుగోలు చేసినట్టు నిరూపించాలంటూ సుజనా చౌదరి కొద్ది రోజుల క్రితం విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు.అంతకు ముందు విజయసాయి రెడ్డి దీనికి సంబంధించి సుజనా చౌదరి పెద్ద ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు.ఈ క్రమంలో సుజనా సవాల్ను విజయసాయిరెడ్డి సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.గతంలో కొన్ని కంపెనీల పేర్లు చెప్పి కొంత మంది పేర్లు చెప్పి అవి సుజనా చౌదరివేనని బొత్స ఆరోపణలు చేశారు.
కానీ దానికి సంబందించిన వివరాలు పూర్తిస్థాయిలో బయటపెట్టలేకపోయారు.ఈ నేపథ్యంలో వాటిని నిరూపించేందుకు వైసీపీ ప్రభుత్వం యాక్షన్ లోకి దిగినట్టు కనిపిస్తోంది.
సుజనా చౌదరి భూముల వ్యవహారాన్ని బయటపెట్టేందుకు ఆయన స్వగ్రామం ఉన్న కంచికచర్ల మండలం మొత్తాన్ని రెవెన్యూ అధికారులు జల్లెడ పడుతున్నారు.2014 నుంచి కొనుగోళ్లను పరిశీలించి బినామీలు ఉన్నారో లేదో అనే విషయాన్ని పరిశీలన చేస్తున్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, వేలాది ఎకరాలను తెలుగుదేశం నాయకులు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు చేశారు.ఆ లిస్ట్ లో సుజనా చౌదరిది కీలక హస్తమని నేరుగానే ఆరోపణలు చేస్తూనే వచ్చారు.
మొత్తం ఈ వ్యవహారంలో సుజనా పాత్ర గురించి తేల్చకపోతే ఆ తరువాత మనమే ఇబ్బందుల్లో పెడతామనే ఆలోచనతోనే ఇప్పుడు ఈ సోదాలు చేయిస్తున్నట్టుగా అర్ధం అవుతోంది.అయితే ఈ విషయంలో బీజేపీ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనేదే అందరికి ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం వైసీపీ బీజేపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఈ విధంగా దూకుడు పెంచడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.