తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం, అభద్రతా భావంలో ఉన్న కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.దీని కోసం ఆ పార్టీ అధినేత చంద్రబాబు వయస్సుని కూడా లెక్కచేయకుండా నిత్యం ప్రజల్లో ఉండేలా అనేక పోరాట కార్యక్రమాలకు నాంది పలుకుతున్నాడు.
వైసీపీ ఏపీలో అధికారంలోకి రావడంతో చాలామంది టీడీపీ నాయకులు కేసుల భయంతో పార్టీలు మారిపోయారు.ముఖ్యంగా బాబు కోటరీ నాయకులుగా చెప్పుకునే సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు బీజేపీలో చేరిపోయారు.
ఇక మిగిలి ఉన్న కీలక నాయకుల్లో చాలామంది తెర ముందుకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.ఇప్పుడు పోరాటాల్లో పాల్గొంటే తమ పాత కేసులు తిరగదోడడంతో పాటు కొట్ట కేసులు బనాయించే పరిస్థితి వస్తుందంటూ వెనక్కి తగ్గుతున్నారు.
అయితే ఎవరు వచ్చినా రాకపోయినా చంద్రబాబు మాత్రం ముందుకే వెళుతూ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమం సక్సెస్ అయ్యిందా లేదా అనే విషయం పక్కనపెడితే టీడీపీకి మాత్రం ఎక్కడలేని మైలేజ్ తీసుకువచ్చింది.ముందు ముందు కూడా కార్యకర్తల్లో ఈ విధంగానే ధైర్యం నింపాల్సిన బాధ్యత బాబు తరువాత మరొకరు ఎవరైనా తీసుకోవాలి.ఆ ఎవరు అనే దానికి రకరకాల పేర్లు పరిశీలనకు వస్తున్నాయి.
ముందుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చినా ఆయన రాజకీయాల వైపు వచ్చే ఆలోచన ఉన్నట్టు లేదు.లోకేష్ కు ఇంకా పార్టీని లీడ్ చేసే అంత స్థాయి వచ్చినట్టు కనిపించడంలేదు.
ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ పేరు అందరు ప్రస్తావనకు తీసుకొస్తున్నారు.కానీ బాలయ్య మాత్రం రెండోసారి గెలిచాక బాగా సైలెంట్ అయిపోయారు.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీకి ఎదురుగాలి వీచినా హిందూపూర్ లో బాలయ్య గెలిచి తన సత్తా చాటుకున్నాడు.కానీ ఇప్పుడు టీడీపీలో సంక్షోభ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో పార్టీకి అండగా ఉండాల్సిన బాలయ్య ఎవరికీ అందుబాటులో ఉండడం లేదు.సినిమా షూటింగ్స్లోనే బిజీ బిజీగా గడిపేస్తున్నారు.టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న’ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి కూడా బాలయ్య హాజరుకాకపోవడం ఇప్పుడు పార్టీలో హాట్ టాఫిక్ గా మారింది.
ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కీలకంగా భావించిన నాయకులంతా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.టీడీపీ పార్టీ నేతలందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఎమ్మేల్యేగా ఉన్న బాలకృష్ణ ఎక్కడా కనిపించపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.
పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉన్న సమయంలో పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత బాలయ్య తీసుకోకపోగా తనకేమీ సంబంధం లేనట్టు ప్రవర్తించడం అటు చంద్రబాబుకి కూడా ఇబ్బందికరంగా మారిందట.